Ketan Murder case : పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్యతో తీవ్ర విషాదంలో మునిగి ఉన్న ఆయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత (తండ్రికి తండ్రి) దేవీచంద్ అగర్వాల్ (Devichand Agarwal).. మనవడి మరణవార్త తెలిసినప్పటి నుంచి అనారోగ్యంతో మంచంపట్టారు. పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ (Vishal Agarwal) సోషల్ మీడియాలో ‘మిస్ యూ డాడ్’ అంటూ భావోద్వేగ పోస్టుపెట్టారు.
కేతన్ కుటుంబవర్గాల సమాచారం ప్రకారం.. దేవీచంద్కు కొంతకాలం క్రితమే మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో అత్యంత పాశవికంగా జరిగిన మనవడు కేతన్ హత్య ఆయనను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ ఘటన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించారు.
అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ దేవీచంద్ కన్నుమూశారు. కాగా కొద్ది వారాల క్రితం పుణెలోని లోహగడ్ కోట పైనుంచి కేతన్కు కాబోయే భార్య సియా గోయెల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి కలిసి.. కేతన్కు లోయలోకి తోసి హతమర్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వెలికితీసిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేతన్ను ఎలా చంపాలనే దానిపై నిందితులు గూగుల్, యూట్యూబ్లలో వెతికారని, చివరికి కోట పైనుంచి తోసేయడమే సులభమైన మార్గమని నిర్ధారణకు వచ్చారని తేలింది.
కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సియా పోలీసుల విచారణలో తెలిపింది. అయితే పెళ్లిని రద్దు చేసుకుంటే కుటుంబపరువు పోతుందని భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో సియా అంగీకరించింది.