కామారెడ్డి: వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. దాదాపుగా 43 గంటల నుంచి గుహల మధ్య ఇరుక్కున్న రాజును భారీ బండరాలను పగలగొట్టి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మూడు రోజులుగా అన్న పానీయాలు లేకుండా గుహల్లోనే ఉక్కిరిబిక్కిరి అయిన రాజును పోలీసులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు రాజుకు ప్రాణాపాయం లేదని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో రాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం వేటకోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడున్న ఓ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని ఫోను కింద పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అతడిని బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో అతడు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని అధికారులు తెలిపారు.