Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యులు కలిసి.. ఏళ్లుగా పాతుకుపోయిన వైద్యులను బదిలీ చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు వైద్యులు అసోసియేషన్ ముసుగులో బదిలీ కావాల్సిన వైద్యులు బదిలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాల మితిమీరి పోయిందన్నారు.
ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వైద్యుల బదిలీలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై శాఖ మంత్రి, హెల్త్ సెక్రెటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు. ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరగడంతో పాటు తీవ్ర మనోవేదానికి గురవుతున్నారన్నారు. వెంటనే గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో నంబర్ 48ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీ శేఖర్, చంద్రశేఖర్, సాంబశివరెడ్డి, సూర్యనారాయణ, బెంజమెన్, మూశాఖాన్, అజామ్, జగతి, అరుణ, కవిత, శకుంతల, అమరావతి, ఎం కవిత, హేమలత పాల్గొన్నారు.