హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని సంస్థ ప్రెసిడెంట్ మరియా సీ లెమన్ ప్రశంసించారు. కాళేశ్వరం లాంటి వినూత్న, అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడం సంస్థ లక్ష్యమని చెప్పా రు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుభవాలను వీడియోలు, ఇతర రూపాల్లో ప్రపంచానికి చాటిచెప్తామని చెప్పారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ కాంగ్రెస్లో సోమవారం ప్రారంభ ఉపన్యాసం చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాళేశ్వరాన్ని సందర్శించిన అమెరికన్ ఇంజినీర్లు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని సంస్థ తదుపరి ప్రెసిడెంట్ షిరిల్ క్లార్క్ పేర్కొన్నారు. నీటిని సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తుకు పైగా తీసుకురావడం ఒక హైడ్రాలిక్ ఇంజినీర్గా తన ఊహకు అందని ఆలోచన అని కొనియాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాగునీటిని సంతృప్తికరంగా ఉపయోగించుకోవడం ప్రపంచస్థాయి సవాల్ అని, దీనిని ఛేదించడంలో తెలంగాణ గొప్ప ఉదాహరణగా నిలిచిందని కీర్తించారు.