హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయలాంటి వారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలను సమర్థంగా అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రతినిధులు స్పీకర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, 33 జిల్లాల సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు స్పీకర్ను ఘనంగా సన్మానించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన టీఎన్జీవో నేతలు సభ నిర్వహణ తీరుపై సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభలు తీసుకొన్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నవారే ఉద్యోగులని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగాలను పణంగా పెట్టి 42 రోజులు సమ్మెచేశారని గుర్తుచేశారు. తాను కామారెడ్డిలో టీఎన్జీవో భవన నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేశానని, ఈ భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సమావేశంలో టీఎన్జీవో కేంద్రం సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని, ఆకుల రాజేందర్, రాంకిషన్, పరమేశ్వర్, వెంకట్రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.