హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నదని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ‘హైదరాబాద్ ది స్ప్రింట్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2022లో రికార్డు స్థాయిలో ఇండ్ల విక్రయాలు జరిగినట్టు పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆఫీసు లీజింగ్ కార్యకలాపాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎదుగుదలలో ప్రభుత్వ పాలసీలు, మౌలిక సదుపాయాల కల్పన, అందుబాటులో ధరలు, అవసరమైన మానవ వనరుల కల్పన వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నది. గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన డాటా సెంటర్ భూ లావాదేవీల్లో 26% హైదరాబాద్లోనే జరిగాయని తెలిపింది. గత డిసెంబర్ వరకు దేశ ఆపరేషనల్ మాల్ స్టాక్లో హైదరాబాద్ 8% వాటాను కలిగి ఉన్నది.
అభివృద్ధికి ఊతమిచ్చిన పాలసీలు
రియల్ ఎస్టేట్, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఎంతో ఉపయోగంగా ఉన్నట్టు సావిల్స్ పేర్కొన్నది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2.0తోపాటు ఈవీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్, స్పేస్-టెక్ ఫ్రేమ్వర్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్, గ్రోత్ ఇన్ డిస్పర్షన్, టీఎస్ ఐపాస్ పాలసీలు అభివృద్ధికి మరింత దోహదం చేశాయని తెలిపింది.
మౌలిక సదుపాయాల కల్పన
తెలంగాణ ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద పడ్డాయని సావిల్స్ తెలిపింది. ఓఆర్ఆర్ నిర్మాణం, మెట్రో రైల్ పొడిగింపు, ఎస్ఆర్డీపీ అమలు, రోడ్డు కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వంటి అంశాలు మౌలిక సదుపాయాల కల్పనతో రియల్ రంగం అనతికాలంలోనే వృద్ధి చెందిందని పేర్కొన్నది.
అందుబాటులో ధరలు
కమర్షియల్ ఆఫీస్ మార్కెట్కు అనుగుణంగా సరసమైన ధరలు ఉండటంతో హైదరాబాద్ ఆపర్చునిటీ స్పేస్గా ఎదిగిందని సావిల్స్ తెలిపింది. ఆఫీసు అద్దెల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నదని పేర్కొన్నది. 2020-22లో ‘ఫ్లెక్సిబుల్ స్పేస్’ల నుంచి హైదరాబాద్ 2.3 మిలియన్ చదరపు అడుగుల లీజు కార్యకలాపాలను చేరుకున్నదని వెల్లడించింది. ఇది దేశంలోని షేర్డ్ స్పేస్ డిమాండ్లో 15 శాతం. దక్షిణాదిలోని ప్రధాన నగరాలు, ద్వితీయ వ్యాపార జిల్లాలు, సబ్ అర్బన్ ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్లో అద్దెలు, ఖర్చులు 10-20 శాతం తక్కువని వివరించింది.
మానవ వనరుల కల్పన
హైదరాబాద్లో నిరుడు ఐటీ/ఐటీఈఎస్ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించారని, ఇది దేశంలోని ఐటీ సంబంధిత ఉద్యోగాల్లో మూడింట ఒక శాతమని సావిల్స్ పేర్కొన్నది. 2022 చివరి నాటికి ఐటీ/ఐటీఈఎస్ రంగంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 7.8 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. 2021తో పోల్చితే ఇది 24 శాతం అధికమని, ఇది హైదరాబాద్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్కు స్వర్గధామంగా ఉన్నదని వివరించింది.
వివిధ రంగాల్లో అభివృద్ధి
హైదరాబాద్లో ‘ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున కార్యకలాపాలను కేంద్రీకరించడం ద్వారా వివిధ రంగాల అభివృద్ధి మరింత సులువైనదని తెలిపింది. దీంతో నగర విస్తరణకు అడ్డంకిగా ఉన్న సవాళ్లు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నది. దీంతో భూ వినియోగ సామర్థ్యం పెరిగి లైఫ్ సైన్సెస్, డాటా సెంటర్స్, ఈవీ ఎకో సిస్టమ్, ఏవీజీసీ, ఏరోస్పేస్ వంటి షార్ప్ ఫోకస్ సెక్టార్లు కేంద్రీకరించబడ్డాయని వెల్లడించింది.
విశ్వసనీయతకు మారుపేరు సావిల్స్
సావిల్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ. దీనికి అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్, ఆఫ్రికా ఖండాల్లోని 70 దేశాల్లో 700లకు పైగా ఆఫీసులున్నాయి. సుమారు 40 వేలమంది ఈ సంస్థలో పనిచేస్తున్నారు. భారత్లోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో సావిల్స్ కార్యాలయాలున్నాయి.
అతిపెద్ద వ్యాపార కేంద్రంగా హైదరాబాద్
అతి తక్కువ కాలంలో హైదరాబాద్ అతిపెద్ద వ్యాపార మార్కెట్ కేంద్రంగా అవతరించింది. ఐటీ, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ వంటి రంగాలకు భవిష్యత్తులో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనున్నది.
– అనురాగ్ మాథుర్, సావిల్స్ ఇండియా సీఈవో
నివేదికలోని మరికొన్ని అంశాలు