హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తే.. ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ర్టానికి! రాజకీయ ప్రయోజనం కోసం అభాండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక. నాలుగు రాళ్లేసి గత ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చుగాక. కానీ ఎండుతున్న చేనుకు, అడుగుతున్న రైతుకు సమాధానం చెప్పితీరాలి కదా! నిందలు సరే.. నీళ్లెందుకు ఇవ్వరు? కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు. 3 బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్! కానీ రేవంత్ సర్కారుకు మేడిగడ్డ ఒక్కటే కనబడుతున్నది. దాన్ని చూపె ట్టి కాళేశ్వరం అంతా నిష్ఫలం అన్నట్టుగా మాట్లాడుతున్నది. అన్నింటికీమించి మేడిగడ్డ బరాజ్ అంటే 87 పిల్లర్లు. మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయంటూ.. స్థిరంగా, దృఢంగా నిలబడిన మిగతా 84 పిల్లర్లను వరదకు వదిలేస్తున్నది సర్కారు. 1.6 కిలోమీటర్ల బరాజ్లో రిపేరు అవసరమైంది కేవలం 50 మీటర్లకే! కాళేశ్వరంపై కట్టుకథలను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ వాస్తవాలను ప్రజలముందు ఉంచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయకట్టును ఎండబెడుతున్న రేవంత్ సర్కారు తీరును ఎండగట్టింది. కేటీఆర్ చెప్పినట్టు..
‘విచారణ చేసుకోండి. కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ, సాగుకు నీళ్లివ్వండి. రైతును ఆదుకోండి’ చలో కాళేశ్వరంప్రాణహిత సాక్షిగా రేవంత్ సర్కారును ఎండగట్టిన బీఆర్ఎస్ మరమ్మతుపై తలోమాట!
మేడిగడ్డకు మరమ్మతులపై ఇప్పుడేమీ చెప్పలేం. సాంకేతిక నిపుణుల నివేదిక తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం.
– ఫిబ్రవరి 13న మీడియా సమావేశంలో రేవంత్
మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ నెల రోజుల్లో నివేదిక అందిస్తుంది. దాని ఆధారంగా బరాజ్కు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందిస్తాం.
– మార్చి 1న మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఉత్తమ్