హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ సోమవారం బుద్ధభవన్లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు వినతిపత్రం అందజేశారు. కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులు పలు జాతీయ పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కు ఓట్లు పొందారని వివరించారు. ఈ గుర్తులు ఈవీఎంల మీద కారు గుర్తును పోలి ఉండటం వల్ల టీఆర్ఎస్కు రావాల్సిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు పడుతున్నాయని తెలిపారు. ఇండిపెండెంట్లలో చాలామంది ప్రతిపక్ష పార్టీల ప్రోద్బలంతో పోటీ చేస్తున్నవారేనని, దీంతో టీఆర్ఎస్కు తీవ్ర నష్టం కలుగుతున్నదని తెలిపారు. గతంలో కూడా టీఆర్ఎస్ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దీంతో టోపీ, ఆటోరిక్షా, ట్రక్కు, ఐరన్బాక్స్లను ఎన్నికల కమిషన్ తొలగించిందని చెప్పారు.
కెమెరా, చపాతి రోలర్, డోలి(పల్లకి), రోడ్డురోలర్, సబ్బుపెట్టె, టీవీ, కుట్టుమిషన్, బోటు గుర్తులు ఈవీఎంలపై కారును పోలి ఉంటున్నాయని పేర్కొన్నారు. చదువురానివారు, వృద్ధులు, గ్రామీణులు వీటిని కారు గుర్తుగా భావించి, వాటికి ఓట్లు వేసే అవకాశం ఉన్నదని వివరించారు. రాజకీయ పార్టీలకు నష్టం చేకూర్చే ఇలాంటి గుర్తులను తొలగించి, ఓటర్లు తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకొనేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. 2011 మార్చి 8న రోడ్డురోలర్ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే జాబితా నుంచి తొలగించినప్పటికీ, దానిని ఇంకా కొనసాగిస్తుండటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడానికి వందల గుర్తులు ఉన్నాయని వీటిని తొలగించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. మునుగోడులో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని టీఆర్ఎస్ నేతలు కోరారు.
ఓటర్లను బండి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు: వినయ్ భాస్కర్
సీఈవోను కలిసిన అనంతరం ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కారును పోలిన గుర్తుల కారణంగా స్వల్ప మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం కేసీఆర్పై క్షుద్రపూజలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని సీఈవోకు ఫిర్యా దు చేశామని తెలిపారు. బండి సంజయ్కి పిచ్చిలేసిందని, ఇష్టం వచ్చినట్టు కుక లెక మొరుగుతున్నాడని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఆదరణ తగ్గుతుండటంతో ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పా రు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మెదడుకు, నోటికి కనెక్షన్ పూర్తిగా తొలగిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బండి సంజయ్ రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడం ఆమె మూర్ఖత్వమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని భరత్కుమార్ దుయ్యబట్టారు.