బడంగ్పేట, జనవరి 23: రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు కదిలివచ్చారు. చెరువు శిఖం భూమిలో కబ్జా వాస్తవమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. శిఖంలోని అక్రమ నిర్మాణాలను తాసీల్దార్ మాధవీరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 155లో ఉన్నది చందన చెరువు శిఖం భూమి అని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ.. చెరువు శిఖంలో వెలసిన నిర్మాణాలను మాత్రమే తొలగించామని చెప్పారు.
శిఖంలో ఉన్న సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రాన్ని, నర్సరీ నిబంధన ప్రకారం ఉంటాయా? ఉండవా? అన్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. నర్సరీలను తొలగించడానికి కొంత సమయం తీసుకుంటామని చెప్పారు. బాలాపూర్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను సైతం తొలగించామని పేర్కొన్నారు. శిఖం భూమి తమదే అంటున్న వారి నుంచి ఆధారాలు తీసుకుంటామని, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ భూమిలో గానీ, చెరువుల పరిధిలో గానీ కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.