Telangana | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు రూ.304.61 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు రైతులకు దూరం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. దీంతోపాటు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఆ రైతులకు పరిహారాన్ని అందించాలని ఆదేశించారు.
పంటనష్టంపై సర్వే చేసిన వ్యవసాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల మంది రైతులకు సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి అనుగుణంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.304.61 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పరిహారం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతకు ముందు మార్చి 17 నుంచి 21 వరకు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది రైతులకు చెందిన 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పటికే రూ.151.64 కోట్ల పరిహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. ఈ విధంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రూ.456.25 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసి అన్నదాతలను ఆదుకొంటున్నది.