Kamareddy | రామారెడ్డి, మార్చి 28: వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే బంధువులు ఆస్తి కోసం దాడులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్టవ్వ (55)కు వారసులు లేరు. ఆమెకు గ్రామంలో 40 గుంటల భూమి, ఇల్లు ఉన్నది. అనారోగ్యంతో ఉన్న కిష్టవ్వ బుధవారం చనిపోయింది. అయితే, దహన సంస్కారాలు నిర్వహించాల్సిన బంధువులు ఆస్తి కోసం తగువులాటకు దిగారు. కిష్టవ్వ తామే సపర్యలు చేశామని, అంత్యక్రియలు తామే చేస్తామని ఆమె చెల్లెలి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. తమకు రూ.2 లక్షలు ఇస్తేనే దహన సంస్కారాలు చేయనిస్తామని కిష్టవ్వ మరిది మైసయ్య కుటుంబీకులు పట్టుబట్టారు.
గురువారం ఉదయం మొదలైన ఈ గొడవ ఉద్రిక్తతతకు దారి తీసింది. ఈ క్రమంలో మైసయ్య కుమారుడు రవీందర్ తల్వార్ తీసుకొచ్చి.. మృతురాలి చెల్లెలి కొడుకు అయిన రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన అప్పరబోయిన నర్సింహులుపై దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో నర్సింహులు చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఆస్తుల గొడవ తర్వాత చూసుకోవచ్చని, ముందు అంత్యక్రియలు జరిపించాలని పోలీసులు, కులస్థులు సర్దిచెప్పడంతో ఇరువర్గాల వారు శాంతించారు. చివరకు గురువారం రాత్రి కిష్టవ్వ దహన సంస్కారాలు పూర్తి చేశారు.