Minister Harish Rao | ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. 13వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్సీ ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. నేడు ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కల్పించిన మౌలిక సదుపాయాలతోనే ఇది సాధ్యమన్నారు.
అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమని, బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన అందరికీ చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. రియల్ హీరోస్గా మారిన 105 కుటుంబాలను నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరు తీసుకున్న నిర్ణయంతో నేడు ఎంతో మంది పునర్జన్మ పొందరాని, మీ సంబంధీకులు మీ ఎదుట లేకపోయినప్పటికీ, మరొకరి రూపంలో మన మధ్యలోనే ఉన్నారన్నారు. నుదిటి గీతను సైతం మార్చి, ప్రాణం నిలిపిన మీరు మరో బ్రహ్మలన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదన్నారు. 2022 సంవత్సంరలో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేశారని, తమిళనాడు 156, కర్ణాటక 151, గుజరాత్ 148 అవయవదానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు.
2013లో జీవన్దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1,288 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరిగాయని, మొత్తం 4829 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగిందన్నారు. అవయవ మార్పిడి చికిత్సల విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, 2022లో దేశవ్యాప్తంగా 1675 ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరిగితే.. తెలంగాణలోనే 530 జరిగాయన్నారు. తమిళనాడు 519, కర్ణాటక 415 సర్జరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 126 ఆర్గాన్ డొనేషన్లు నమోదయ్యాయని చెప్పారు. అయితే, ఇది చాలదని, జీవన్దాన్లో నమోదై, అవయవాల మార్పిడి చేసుకొని జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తున్న వారి సంఖ్య సుమారు 3వేలుగా ఉందన్నారు. అవయవ మార్పిడి అనగానే ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులే గుర్తుకు వచ్చేవని, కానీ.. ఇప్పుడు కార్పొరేట్కు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు నిమ్స్లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11 మొత్తం 480 టాన్స్ప్లాంటేషన్స్ జరిగాయన్నారు. ఇందులో అత్యధికంగా 436 కిడ్నీ టాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయన్నారు.
గత నెలలో నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందన్నారు. నిమ్స్ వైద్యులు ఒకే రోజు రెండుమూడు అవయవ మార్పిడులను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలకు నిమ్స్ కేరాఫ్గా మారిందన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీలను ప్రభుత్వం పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేరువ చేసిందన్నారు. దీంతో పాటు సర్జరీ చేసుకున్న వారికి జీవిత కాలం పాటు నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల విలువ చేసే మందులను ఉచితంగా అందిస్తుందన్నారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం తదితర కారణాలతో రోగాలు చుట్టుముట్టి, చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదన్నారు. అవగాహన లేమి, నిర్లక్ష్యం కారణంగా రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, పరీక్షలు చేయించుకొని వైద్యం పొందకపోవడంతో ఆ రోగాలు ముదిరి అవయవాలపై చెడు ప్రభావం చూపుతున్నాయన్నారు. బీపీ, షుగర్ సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం, కంటి సమస్యలు ఎదురై ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయన్నారు. అవయవాలు మార్పిడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేమని, అంతటి సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదని, కాబట్టి మరణించిన తర్వాత విలువైన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను నిర్వర్తించి, ఆర్గాన్ డోనేషన్ ద్వారా ప్రాణం పోయాలన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను సేకరించి అవసరమైన రోగులకు దానం చేయవచ్చన్నారు. ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ఆర్గాన్స్ ఎనిమిది మందికి ప్రాణంపోయవచ్చన్నారు. అవయవదానం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తొలిసారిగా తెలంగాణ ఆన్లైన్లో పోర్టల్ను ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ఏపీ, కేరళ, గుజరాత్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు మన విధానాన్ని అనురిస్తున్నాయన్నారు. డొనేషన్లు, ట్రాన్స్ ప్లాంటేషన్ల విషయంలో తెలంగాణ మెరుగైన పనితీరును కనబరుస్తుందని, మొత్తం 36 ప్రభుత్వ ఆసుపత్రులు జీవన్ దాన్లో రిజిస్ట్రర్ కాగా, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతున్నాయన్నారు.