హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో పౌరులు కేంద్రంగా మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ విధానంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సంస్కరణలు తీసుకొచ్చింది. తద్వారా ఫాస్ట్గా, పారదర్శకంగా ప్రజలు, యజమానులకు సులువుగా సేవలు అందిస్తున్నది. జవాబుదారీతనం ఉండేలా నిర్లక్ష్యం, జాప్యం, అవినీతికి ఆస్కారం లేకుండా పన్నులు వసూలు చేస్తున్నది. సేవల్లో మానవ ప్రమేయం పూర్తిగా తగ్గించి సాంకేతిక పరిజ్ఞానంతో ఇండ్లకు అనుమతులు ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో ప్రజలు సులువుగా, సులభంగా, ఎక్కడి నుంచైనా సేవలను పొందేందుకు, దరఖాస్తు, చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చారు. అవినీతితో ప్రభుత్వ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడకుండా నిరోధించారు.
మ్యుటేషన్
రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎవరైనా ఆస్తులు విక్రయించినా, కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆటోమెటిక్గా మున్సిపల్ రికార్డుల్లో మ్యూటేషన్ అయ్యేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. ఈ విధానాన్ని మార్చి మొదటి వారం ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 57,763 ఆస్తులను ఆటో మ్యుటేషన్ చేశారు. ఆటో మ్యుటేషన్తోపాటుగా అదే సమయంలో ఆస్తి పన్ను అంచనాను జనరేట్ చేస్తారు. ఇప్పటి వరకు దీనిద్వారా రూ.47.84కోట్ల ఆదాయం వచ్చింది.
ఇండ్లకు మ్యాపింగ్
దేశంలోనే తొలిసారిగా ఇండ్లకు పన్నులు వేయడానికి జియో మ్యాపింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో భువన్ ద్వారా ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 18 లక్షల ఇండ్లకు జియో మ్యాపి ంగ్ పూర్తి అయింది. 27 వేల కొత్త ఇండ్లకు పన్ను విధించారు. 2.50 లక్షల ఇండ్లలో మార్పులు జరిగినట్టు గుర్తించారు. వీటికి అదనపు పన్ను విధించారు. వీటి ద్వారా మున్సిపల్ శాఖకు రూ.88 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీల్లో వంద శాతం ఇండ్లను జియో ట్యాగింగ్ చేశారు.
క్యూఆర్ కోడ్ విధానంలో చెల్లింపులు
ప్రజలు, యజమానులు వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తులు, ఫీజు చెల్లింపు వంటి వాటి కోసం సిటిజన్ బడ్డి అనే మొబైల్ అప్లికేషన్ యాప్ రూపొందించారు. ఆన్లైన్లో చెల్లించే సౌలభ్యం తీసుకొచ్చారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, ఆటో మ్యుటేషన్, నల్లా కనెక్షన్, నల్లా నీటి బిల్లు చెల్లింపు, ట్రేడ్ లైసెన్స్, రెన్యూవల్, ప్రకటనల లైసెన్స్, మొబైల్ టవర్ అప్లికేషన్, రోడ్ కటింగ్ ఆమోదం వంటి 23 రకాల సేవలను అందిస్తున్నారు.
ఆన్లైన్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను వెంట నే అందించేందుకు మార్చి 21 నుంచి ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. పట్టణాలు, నగరాల్లోని దవాఖానల్లో జరిగే జనన, మరణాలు నమోదుకు మొబైల్ యాప్ రూపొందించారు. వివరాలు నమోదు చేస్తే కుటుంబసభ్యులకు సర్టిఫికెట్ లింక్ వెళ్తుంది. ఈ విధానంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 93,766 జనన ధ్రువీకరణ, 8,673 మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. శ్మశాన వాటికల వద్ద 2,744 డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు.