హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కరణలు వేగవంతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో రెండు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వర్సిటీ మెస్ల్లో సమీకృత ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలుచేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కాలేజీలో యాప్ బేస్డ్ జియో అటెండెన్స్ను అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుచేస్తారు. ఈ విధానం ద్వారా మెస్ల్లో నాన్బోర్డర్లకు అడ్డుకట్టపడటంతో పాటు పారదర్శతకు పెద్దపీట వేయవచ్చని భావిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే.. మెస్ల్లో నేరుగా అటెండెన్స్ నమోదు చేయడం ఉండదు. ప్రస్తుతానికి వర్సిటీలో 808 సీసీ కెమెరాలున్నాయి. అదనంగా మరో 215 కొత్త కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. ఈ సాంకేతికను సీసీ కెమెరాల్లో అనుసంధానించి పర్యవేక్షిస్తారు.
మెస్ల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్తో అనుసంధానిస్తారు. ఇవి విద్యార్థి ఫొటో, ఐడీ నంబర్, మెస్ నంబర్ వంటి వాటితో సరిపోల్చుకొంటాయి. దీంతో ఆటోమెటిక్గా హాజరు నమోదవుతుంది. దీనిద్వారా రోజువారీగా ఎంత మంది మెస్ల్లో భోజనం చేస్తున్నారో తెలుసుకోవడంతోపాటు పర్యవేక్షణ సులభతరమవుతుంది.
ఓయూలో మొత్తంగా 808 సీసీ కెమెరాలున్నాయి. వాటిలో క్యాంపస్ రోడ్లమీద 156, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 32, ఠాగూర్ ఆడిటోరియం 14, సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ 26, సీఎఫ్ఆర్డీ బిల్డింగ్ 45, పీజీఆర్ఆర్సీడీఈ 15, ఇంజినీరింగ్ కాలేజీ 250, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 100, ఆర్ట్స్ సోషల్ సైన్సెస్ 36, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ 30, కాలేజ్ ఆఫ్ లా 20, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 34, కాలేజీ ఆఫ్ సైన్స్ 50 చొప్పున సీసీ కెమెరాలున్నాయి. మరో 215 ఏర్పాటు చేస్తారు.
వర్సిటీలోని విద్యార్థులు, ఆచార్యులకు యాప్బేస్డ్ జియో అటెండెన్స్ అమలుకు అధికారులు నిర్ణయించారు. ఈ విద్యాసంవత్సరంలో వచ్చే సెమిస్టర్ నుంచి ఈ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్సిటీలో బయోమెట్రిక్ అటెండెన్స్ను అమలుచేస్తున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్గా అమలుచేసి, ఆ తర్వాత వర్సిటీలో జియో అటెండెన్స్ను సంపూర్ణంగా అమలుచేయాలని నిర్ణయించారు. మొత్తం తరగతి గదిని స్కాన్చేసి విద్యార్థుల చిత్రాలను క్యాప్చర్చేయడం ద్వారా అటెండెన్స్ను నమోదుచేసే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీతో వర్సిటీ అధికారులు చర్చిస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలీకృతమైతే వర్సిటీలో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా అటెండెన్స్ను నమోదుచేసి తరగతులను పటిష్ఠంగా నిర్వహించవచ్చు. ప్రస్తుతం బయోమెట్రిక్ హాజరు కోసం ఒక్కో విద్యార్థికి కనీసంగా 10 సెకండ్లు పడుతున్నది. అదే ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే 90 సెకండ్లలోనే మొత్తం తరగతి గది హాజరును నమోదుచేయవచ్చు.
జియో అటెండెన్స్ అమలుపై నిర్ణయించాం. ప్రయోగాత్మకంగా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ జియో అటెండెన్స్ను అమలు చేసి పర్యవేక్షిస్తాం. ఆ తర్వాత వర్సిటీలోని కాలేజీలన్నింటికీ ఈ విధానం అమల్లోకి వస్తుంది.
– ప్రొఫెసర్ డీ రవీందర్, వీసీ