హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మిల్లింగ్ చేసిన బియ్యం తీసుకోవడంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కొర్రీలు పెడుతున్నది. ఇన్నేండ్లపాటు సాఫీగా సాగిన విధానాన్ని జటి లం చేస్తూ.. అటు మిల్లర్లను, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించడం లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అందిస్తున్నది. ఈ ధాన్యాన్ని బియ్యం గా మార్చి ఎఫ్సీఐకి సరఫరా చేయాలి. ఈ బియ్యాన్నే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటారు. మిల్లర్ల నుంచి సేకరించిన సీఎంఆర్ను రైస్ను ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఉంచుతుంది. గతంలో 22 లక్షల టన్నులను బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఉంచేది. దానిని ఈ ఏడాది 14 లక్షల టన్నులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గి.. మిల్లర్లు తరలించిన బియ్యం లోడ్లు దిగుమతి కాక లారీలు రోజుల తరబడి ఎఫ్సీఐ గోదాముల ఎదుట పడిగాపులు కాస్తున్నాయి.
రైస్ మిల్లర్లు తరలించిన బియ్యంలో ఎలాంటి తేడాలు లేకపోయినా ఎఫ్సీఐ మాత్రం కొత్తగా కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. బియ్యం సరిగా లేవని, పురుగు ఉన్నదని, రంగు లే దంటూ రకరకాల కారణాలు చెప్తూ వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నదని చెప్తున్నారు. గతంలో తనిఖీ సమయంలోనూ మిల్లింగ్ జరిగేది. ఈసారి మాత్రం తనిఖీల సమయంలో మిల్లింగ్ మొత్తం నిలిపివేసినట్టు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరిలో 20 రోజులపాటు మిల్లింగ్ను నిలిపివేశామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెలలోనే 2లక్షల వరకు సీఎంఆర్ బాకీ ఉన్నది. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతున్నది. మరో 15-20రోజుల్లో యాసంగి పంట చేతికొస్తుంది. సీఎంఆర్ రైస్ ఆలస్యంతో ఇప్పటికే గత యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యమే మిల్లుల్లో పేరుకుపోయింది. కొత్తగా వచ్చే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉం చుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనవసరపు కొర్రీలు పెట్టకుండా సీఎంఆర్ రైస్ను త్వరితగతిన తీసుకుంటే యాసంగి కొనుగోళ్లకు ఇ బ్బందులు ఉండవని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.