హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖరాశారు. వీరికి రెండో డోస్ వేసి 8-10 నెలలు దాటిందని గు ర్తుచేశారు. వ్యాక్సిన్ తీసుకొని ఎ క్కువకాలం అవుతుండటం, కొత్త వేరియంట్లు వస్తుండటాన్ని దృష్టి లో ఉంచుకొని వారికి బూస్టర్ డో స్ వేయాలని సూచించారు. కొవిడ్ టీకా కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని హరీశ్రావు ఆ లేఖలో కోరారు. వ్యవధి 12 వారాలు ఉండటంతో రెండో డోస్ వేయడం కష్టంగా మారిందన్నారు. ‘వలస మారిందన్నారు. ‘వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోతున్నారు. వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది ఎక్కువగా ఉన్నది. మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ర్టానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. రెండో డోస్కు 12 వారాల గడువు ఉండటంతో కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గించాలని సూచించారు. తెలంగాణలో 18 ఏండ్లు దాటిన 2.77 కోట్ల మందిని కొవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.77 కోట్ల డోసులను వేసినట్టు తెలిపారు. ఇందులో 2.49 కోట్లు మొదటి డోస్, 1.28 కోట్లు రెండో డోస్ ఉన్నాయని వివరించారు. అర్హులందరికీ టీకా రెండు డోసులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని, బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ వస్తే చికిత్స నిమిత్తం టిమ్స్ దవాఖానకు తరలించామని చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తయితేగాని ఏ వేరియంట్ అనేది చెప్పడం సాధ్యం కాదన్నారు. శుక్రవారం బాలానగర్ ఫిరోజ్గూడలో, ఓల్డ్ బోయిన్పల్లిలోని శాంతినికేతన్ కాలనీల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్తీ దవాఖానలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కరోనా కొత్త వేరియంట్ కేసులు మనరాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని, కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. అలా అని కొవిడ్ పట్ల నిర్లక్ష్యం చూపితే ప్రమాదమని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంగా సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పరిధిలోనే 27 వేల పడకలు సిద్ధం చేసినట్టు తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వ పోరాటానికి ప్రజలు తమవంతు సహకారం అందించాలని అన్నారు. డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో 2.51 కోట్ల మంది మొదటి డోసు తీసుకోగా, 1.30 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకుంటేనే కరోనా నుండి పూర్తి స్థాయి రక్షణ వస్తుందన్నారు. కాబట్టి త్వరగా ప్రతి ఒకరూ రెండు వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు తెలంగాణ పోరాటంలో అమరుడైన శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంతో మంది త్యాగాలు, సీఎం కేసీఆర్ పోరాట పటిమ వల్ల తెలంగాణ కల సాకారమైందని, బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు.
పట్టణ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో బస్తీ దవాఖానలు ప్రారంభించారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు మొత్తం 258 దవాఖానలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్య సేవలు, మందులు, పరీక్షలు చేయడం జరుగుతుండటంతో అన్నివర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా 57 పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం వల్ల బస్తీవాసుల చెంతకే నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, వ్యాధి ముదరకుండానే, రోగ నిర్ధారణ జరగడం వల్ల రోగి ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒకో బస్తీ దవాఖాన ద్వారా రోజుకు సగటున 100 మందికి ఓపీ సేవలు అందుతున్నాయని, బస్తీ దవాఖానలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 60.18 లక్షల మంది వైద్య సేవలు పొందారని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 92 బసీ ్తదవాఖానలు జీహెచ్ఎంసీ పరిధిలో, 144 బస్తీ దవాఖానలు జీహెచ్ఎంసీ వెలుపల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మంచి సంకల్పంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానలు అన్నివర్గాలకు చేరువై దోస్తీ దవాఖానలుగా మారాయని చెప్పారు. బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా 4000 పల్లె దవాఖానలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
రాష్ట్రంలోని పలుచోట్ల శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 19 కరోనా కేసులు వెలుగుచూశాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలోని గురుకుల పాఠశాల-జూనియర్ కళాశాలలో 9 మందికి, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బోధన్ పట్టణంలో ఒక్కో విద్యార్థికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
బస్తీ దవాఖానలు ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు ఓల్డ్ బోయిన్పల్లి శాంతినికేతన్ కాలనీలో ఇంటింటా తిరిగి వ్యాక్సిన్ గురించి ప్రచారం చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారా.. లేదా? అని అడిగారు. రెండు వ్యాక్సిన్లు తీసుకుంటేనే పూర్తి రక్షణ వస్తుందని, తక్షణం అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు. అనంతరం కొవిడ్ వ్యాక్సిన్ సంచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.