హైదరాబాద్ : ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రెడో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరిగిందే వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారని ఆయన మండిపడ్డారు. సీఎం క్యాంప్ ఆఫీసును నక్సలైట్లు పేల్చేయాలంటూ మాట్లాడి వారి సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచి ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయాలనే నక్సలైట్ ఎజెండాతో పని చేస్తున్నదన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు.
ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు.. అందుకే ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా పక్కనపెట్టారని పేర్కొన్నారు. పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని రేవంత్ మరచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్రంలో నక్సలిజంగా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్గడ్లోని సీఎం క్యాంప్ ఆఫీస్పై దాడి చేయాలని రేవంత్రెడ్డి, ఆ రాష్ట్ర పీసీసీ లేదంటే ఏఐఐసీ సూచిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ అద్భుతంగా ఉంది కాబట్టే తెలంగాణలో నక్సలిజం తగ్గిపోయి శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. రేవంత్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.