TSREDCO on Modi Solar Power | సోలార్ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తున్నదని రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO- రెడ్కో) చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన కేంద్రం, దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పునరుత్పాదక శక్తిలో ప్రధానమైన సోలార్ విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు కేంద్రం యత్నిస్తున్నదన్నారు. సోలార్ విద్యుత్ పరికరాల మీద ట్యాక్సులు, సుంకాలు పెంచుతూ వినియోగదారులకు సౌర విద్యుత్ దూరం చేస్తున్నారని తెలిపారు.
సోలార్ పరికరాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని, దిగుమతి సుంకాన్ని పెంచారని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సోలార్ ప్యానల్స్పై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు. 15వ తేదీ తర్వాత సబ్సిడీలో భారీగా కోతలు విధించారని వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం ఇండ్లకు ఒక కిలోవాట్ పీక్ సోలార్కు రూ.21,320 సబ్సిడీ ఉన్నదని, 15 తర్వాత అది రూ.14,588 తగ్గిస్తున్నారని తెలిపారు. 5 కిలోవాట్ పీక్ సోలార్ ప్యానల్స్కు రూ.74,560 సబ్సిడీ ఉంటే, రూ.58,352కు, 10 కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థకి రూ.1,21,160 సబ్సిడీ ఉంటే, రూ.94,822కి సబ్సిడీ తగ్గిపోనున్నదని తెలిపారు. అంటే వినియోగదారులపై రూ.26,338 భారం పడనున్నదని వివరించారు.
అపార్ట్మెంట్లకు ప్రస్తుతం కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థకు రూ.10,660 సబ్సిడీ ఉన్నదని వై సతీశ్ రెడ్డి అన్నారు. 15 తర్వాత అది రూ.7,294 తగ్గిపోతుందని, 3 కిలోవాట్ పీక్ ప్యానల్స్కి రూ.28,680 సబ్సిడీ ఉండగా, రూ.21,882కి తగ్గిపోతుందని వివరించారు. కేంద్రం తీరుతో ఇప్పటికే సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వాళ్లు కూడా వెనకి తగ్గుతున్నారని చెప్పారు.
మోదీ విధానాల పుణ్యమా అని ధరాభారంతో ప్రస్తుతం దాదాపు 40 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ట్యాక్సులు పెంచుతూ, సబ్సిడీలు ఎత్తేస్తూ సోలార్ విద్యుత్ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఓ వైపు పునరుత్పాదక శక్తికి కోతలు పెడుతూ, మరోవైపు సోలార్ విద్యుత్ ఎగుమతి చేస్తామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. మరో రెండు, మూడేండ్లలో సోలార్పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రం ఇకనైనా పునరాలోచన చేయాలని, సోలార్పై జీఎస్టీ, దిగుమతి సుంకాలను ఎత్తివేయాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.