తెలంగాణ తడిసి ముద్దయింది. నైరుతి రుతుపవనాలతోపాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. శనివారం నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు నిజామాబాద్ జిల్లాల్లో సగటున 10.56 సెం.మీ., నిర్మల్ జిల్లాలో సగటున 9.34 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లాలో సగటున 6.51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 9: రాష్ట్రవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. వీటిలో 12 ప్రాంతాలు నిజామాబాద్, ఎనిమిది ప్రాంతాలు నిర్మల్ జిల్లాల్లోనే ఉన్నాయి. కామారెడ్డిలో మరో మూడు ప్రాంతాలు, మంచిర్యాల జిల్లాలో ఒక ప్రాంతం ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా ఖైరతాబాద్లో 3.10, శేరిలింగంపల్లిలో 2.68 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు కోతకు గురవటంతో వాహనాలను దారి మళ్లించారు. భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలు స్తంభించాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఓపెన్కాస్ట్ గనుల్లో నీరు నిలువటంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పంటపొలాలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రోజంతా ముసురు వాన కురిసింది. మిగతా జిల్లాల్లో స్పల్ప వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.46 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. విద్యుత్తు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు.
ఎడతెరపి లేని వానలతో పలుజిల్లాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు గ్రామాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. నిజామాబాద్ నగరంలోని మాలపల్లి, అర్సపల్లి ప్రాంతాల్లో ప్రధాన రోడ్డు గంటల కొద్దీ స్తంభించింది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ పలు కాలనీల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమ్గల్, ఏర్గట్ల, సిరికొండ, నవీపేట మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో వరి, సోయాబీన్ పంటలు నీట మునిగాయి. నిజామాబాద్లో 63 చెరువులు, కామారెడ్డిలో 62 చెరువులు అలుగులు పోశాయి. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరులో నీటి మట్టం పెరుగుతున్నది. బుగ్గవాగు వరద పెరగడంతో డోర్నకల్- లింగాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో సింగరేణి పరిధిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లాలోని పలు ముంపు ప్రాంతాల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, శాస్త్రినగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ్ నగర్, బుధవార్పేట్ హరిజన వార్డు, డాక్టర్స్ లేన్ ప్రాంతాలను సందర్శించి, పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. బాసర మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో గల రవీంద్రపూర్, శారదానగర్ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలుగు అడుగుల మేర నీరు చేరడంతో నీట మునిగిన పది ఇండ్లకు చెందిన వారిని అధికారులు పడవల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పింది. ఆదివారం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 13వ తేదీ వరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విపత్తుల నిర్వహణ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
స్థానికంగా ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగి తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతయ్యారు. తండాకు చెందిన మక్కల నడిపి సాయిలు (43), బ్యారంగిల రెడ్డి (35) పశువులను మేపడానికి శనివారం ఉదయం శివారుకు వెళ్లారు. భారీ వర్షం కురిసిన కారణంగా నెమలికుంట చెరువులోకి వరద భారీగా చేరి, అలుగు పారుతుంది. సాయంత్రం పశువులను అలుగు దాటిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి నిజాంసాగర్ ప్రధాన కాలువలో కొట్టుకుపోయారు. తాసిల్దార్ అనిల్కుమార్, ఎస్హెచ్వో లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.