Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులతో పాటు కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను ఆమె అలెర్ట్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటి పారుదలశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.