హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ జారీచేసిన నోటిఫికేషన్లో ఇప్పటికీ భర్తీ చేయని 550 పోస్టులను పాత జిల్లాల ప్రాతిపదికపై భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రపతి వెలువరించిన నూతన ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే ఆ పోస్టులను భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ నోటిఫికేషన్ జారీ తర్వాత 1,950 పోస్టులను భర్తీ చేసిన టీఎస్ఎస్పీడీసీఎల్.. మిగిలిన పోస్టుల భర్తీలో కొత్త జిల్లా ప్రాతిపాదికన స్థానికులకు 95% రిజర్వేషన్ కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. దీన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు పై తీర్పును వెలువరించింది.