హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. కొంత కాలంగా కరోనా పరిస్థితులతో పాటు చమురు ధరల పెరుగుదల కారణంగా కుదేలైనప్పటికీ సంస్థ ప్రయాణీకుల ఆదరణను చూరగొంటూనే ఉంది. ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఓఆర్ సాధించడంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది అందరి కృషితోనే ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సోమవారం ఒక రోజే రూ.13.04 కోట్ల మేర టికెట్టు ఆదాయం సమకూరడం సిబ్బంది , అధికారుల ఘనత అని సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు 31.77 లక్షల కిలోమీటర్లు బస్సులను నడిపి 41.05 ఇ.పి.కె ( ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ ) సాధించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మరింత ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టికెట్టు ఆదాయం పెంచుకోవడం ద్వారా సంస్థ కొంత ఆర్థిక పరిపుష్టిని సాధించగల్గుతుందని, ఈ మేరకు సిబ్బంది, అధికారులు ఇదే రకంగా కృషి చేయాలని మంత్రి సూచించారు.