హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు ఎక్కువవుతున్నది. గుట్ట చుట్టూ పచ్చదనం, గుట్టపై స్వామివారి ఆలయం, ఆలయంలో ప్రతి శిల్పం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడేలా చేస్తుండటంతో భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు.
యాదగిరీశుడిని దర్శించుకొని, ఆలయ పరిసరాలను వీక్షించి మనఃప్రశాంతతను పొందుతున్నారు. భక్తుల రాకతో ఆలయ హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతున్నది. ఆలయ పునఃనిర్మాణానికి ముందు ఒక నెలలో రూ.6 కోట్లకు మించని హుండీ ఆదాయం.. ప్రస్తుతం పది కోట్లకు చేరింది. ఏప్రిల్లో రూ.7 కోట్లు దాటగా, మే లో రికార్డు స్థాయిలో రూ.10,74,31,531 ఆదాయం సమకూరింది.
ఈ నెల 5(ఆదివారం)న 65 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ.నాలుగున్నర లక్షల ఆదాయం సమకూరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వీయ పర్యవేక్షణలో నిర్మితమైన ఈ ఆలయం పునఃప్రారంభమైనప్పటి నుంచి భక్తుల రాక క్రమంగా పెరుగుతున్నది. స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. ముఖ్యం గా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభదినాల్లో స్వామిని దర్శించుకొనేందుకు, పూజలు, వ్రతాలు చేసుకొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆలయం పునఃప్రారంభించిన నెల(ఏప్రిల్)లో రూ.7,93,99,632 ఆదాయం సమకూరగా, మే నెలలో ఒక్కసారిగా ఆదాయం రూ. 10,74,31, 531కి పెరగటం గమనార్హం.