Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం. ధాన్యం సేకరణలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా రికార్డు స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సేకరించిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో, రైతు సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమన్నారు.
దాదాపు రూ.10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి ఈ సీజన్లో సేకరించామని చెప్పారు. ధాన్యం సేకరణకు రికార్డ్ స్థాయిలో 7000పైచీలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 1400 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ధాన్యం పూర్తయిన కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. గత సంవత్సరం యాసంగి సీజన్లో మే 30నాటికి కొనుగోలు చేసిన ధాన్యం కంటే 12లక్షల టన్నులు అధికంగా సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
ఎఫ్సీఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం వచ్చిన ధాన్యంలో ఏ మిల్లర్ కోత పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కమలాకర్ హెచ్చరించారు. ప్రతిపక్షాలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన వాళ్లు.. కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లి రాజకీయం చేయకుండా.. ప్రతి ఒకరూ బాధ్యతగా ఉండాలన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.