సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం సాధ్యమైందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్టపతులు, ఇంజినీర్లు, జిల్లా పోలీస్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతరులను ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడారు. మహకుంభ సంప్రోక్షణ మహోత్సవం రోజున సమయాభావం వల్ల సీఎం కేసీఆర్ అందరిని సన్మానించలేకపోయారన్నారు. మిగితా వారిని కూడా సగౌరవంగా సత్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నవారందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు: మంత్రి జగదీశ్రెడ్డి
ఎన్నో మంచి పనులతో కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని, ఆ అతి కొద్ది మందిలో సీఎం కేసీఆర్ ఒక్కరని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికవాది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైనవారిని సన్మానించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, వైటీడిఏ వైస్ చైర్మన్ కిషన్రావు, తదితరులు పాల్గొన్నారు