హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మల్టిపుల్ ఓటర్ కార్డుల ఏరివేతపై గురువారం బుధ్ధభవన్లో అన్ని రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వికాస్రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫొటో సిమిలర్ ఎంట్రీలను హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ఓట్లు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. మే 20 వరకు బోగస్ ఓట్ల గుర్తింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. ఈఆర్వో డబుల్ ఓట్లను గుర్తించి యాప్లో ఎంట్రీ చేస్తారని అన్నారు. ఈఆర్వో వెరీఫికేషన్ చేశాకనే వాటిని తొలగించడం జరుగుతుందన్నారు.
సిమిలర్ ఫొటో ఓటర్ ఐడి కార్డులను గుర్తించేందుకు చదువుకున్న వారిని బీఎల్వోస్గా నియమించాలని కోరినట్టు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్ తెలిపారు. ఫొటో సిమిలర్ ఎంట్రీస్కు సంబంధించి 22 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయని, వాటి తొలగింపును వేగవంతం చేయాలని కోరామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.