సింగరేణి నల్ల బంగారం.. తెలంగాణ కొంగు బంగారం. సింగరేణి విషయంలో కేంద్రం అనుకున్నదే చేసింది. 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిని బొంద పెట్టే కుట్రలకు మోదీ తెగబడ్డాడు. నరేంద్రమోదీ అంటేనే నమ్మించి మోసం చేయడం అని, బీజేపీ అంటే బడా జూటా కోర్ పార్టీ అని శుక్రవారం (డిసెంబర్ 2న) బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల భేటీ నిరూపించింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి తెలంగాణపై తనకు ఎంత అక్కసు ఉన్నదో మోదీ విస్పష్టం చేశారు.
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెలంగాణది.. కేంద్రానికి కేవలం 49 శాతమే.. సింగరేణిని ప్రైవేట్పరం చేసే ఆలోచనే మాకు లేదు’ అని మోదీ సింగరేణి గడ్డ మీద చెప్పి నెల రోజులు కూడా గడవక ముందే సింగరేణి మనుగడే ప్రశ్నార్థకం చేసే చర్యకు బెంగుళూరు వేదికగా వేలానికి పెట్టారు. మోదీ బహురూపులతనానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం ఉంటుంది.
సింగరేణి సంస్థ మనుగడే బొగ్గు తవ్వకంపై ఆధారపడి ఉన్నదని అందరికీ తెలుసు. నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ ప్రజలపైన మొదటి నుండి విషం వెళ్లగకుతూనే ఉన్నది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను దెబ్బకొట్టి తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాన్ని ముందే పసిగట్టిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2021వ తేదీన సుమారు 450 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్న కళ్యాణిఖని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి బ్లాక్లను తమకే కేటాయించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
సంపద సృష్టించడం చేతకాక రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అమ్మకానికి పెట్టిన అజ్ఞానపు మోదీ ప్రభుత్వం.. నిస్సిగ్గుగా సింగరేణి బ్లాకులను వేలానికి పెట్టింది. సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలంటే కొత్త బొగ్గుబ్లాక్లను కేంద్రం కేటాయించాలి. కానీ, లాభాల్లో ఉన్న సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించకపోగా, సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేయడం ద్వారా సంస్థ ఉత్పత్తిపైన కేంద్రం పెనుభారాన్ని మోపేందుకు సిద్ధపడింది. ఇటువంటి పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి లేని సింగరేణి సంస్థ ఎలా బతుకుతుంది?
తెలంగాణ ప్రజలపై మోదీది మొదటి నుంచి సవతి తల్లి ప్రేమే. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు ఒక నీతి.. తెలంగాణకు మరోరీతిగా కేంద్రం వ్యవహరిస్తున్నది. గుజరాత్ లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా ఆ రాష్ర్టానికి అప్పగించారు. అదే తెలంగాణకు మాత్రం మోదీ మొండి చెయ్యి ఇస్తున్నడు. విశాఖ ఉకు పరిశ్రమ లాగానే సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించి తద్వారా సింగరేణిని నామరూపాలు లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది.
బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు సింగరేణి 11వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి, దాని అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు దీక్షలు, పోరాటాలు, సమ్మెలు చేసినా కేంద్రం కార్మికుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. సింగరేణి కార్మికుల ఆర్థిని, ఆవేదనను, ఆందోళనను బీజేపీ అర్థం చేసుకోలేదు. మోదీ తానా అంటే తందానా అనే బీజేపీ లోకల్ బ్యాచ్కు మొరుగుడు తప్ప రాష్ర్టానికి మేలు చేయాలనే ఆలోచన, అవగాహన లేకపోవడం శోచనీయం. వీరి వైఖరి సింగరేణి మనుగడను, కార్మికుల హక్కులను ప్రశ్నార్థకం చేస్తున్నది.
కేంద్రప్రభుత్వం మొదటి నుండి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. భూగర్భంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ కార్మికుల అలవెన్స్ 12 శాతం మీద సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తే అందులో రూ.10వేలకు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వటం అంత్యంత దారుణం. సింగరేణి కార్మికుల ఆదాయపు పన్నును మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం సింగరేణి కార్మికులకు తెలుసు.
దీనిపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు సరికదా. జూలై 1, 2021 నుంచి ఇప్పటి వరకు 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేజ్ బోర్డు ఇవ్వక కార్మికులను ఇబ్బంది పాలు చేస్తున్నది. తెల్లారి లేస్తే మైకుల్లో గొంతులు చించుకునే ఏ ఒక బీజేపీ నాయకుడు దీనిపై స్పందించడు. వేజ్ బోర్డు అంశంపై ఇప్పటి వరకు ఆరుసార్లు చర్చలు జరిపినా, కమిటీలు వేసినా, నామమాత్రపు మీటింగ్లు పెట్టి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నది మోదీ సర్కార్. అలాగే కేంద్రప్రభుత్వ ఉద్యోగాల బేసిక్ డీఏ పైన 50 శాతం పెన్షన్ ఇస్తుంటే సింగరేణి కార్మికులకు మాత్రం 25 శాతం ఇస్తున్నది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఒక న్యాయం.. సింగరేణి కార్మికులకు మరో న్యాయమా?
అన్ని రంగాల్లో వెలుగు జిలుగుల ప్రయాణంతో దూసుకుపోతున్న తెలంగాణను శాశ్వత చీకటిలోకి నెట్టటానికి మోదీ కన్ను ముందుగా సింగరేణిపై పడింది. సింగరేణిలో ఇప్పటికే కోయగూడెం ప్రైవేట్పరం అయింది. కల్యాణిఖని, సత్తుపల్లి, శ్రావణ్పల్లితోపాటు కొత్తగా పెనగడపను మోదీ సర్కార్ ఆక్షన్కు పెట్టింది. ఇలా దశల వారీగా సింగరేణిని ప్రైవేట్పరం చేయటంలో తెలంగాణపై మోదీకి దీర్ఘకాలిక వ్యూహం ఉన్నదన్నది పచ్చి నిజం. మోదీ సింగరేణినే ఎందుకు ఎంచుకున్నారు? అనే కోణాన్ని అర్థం చేసుకుంటే కానీ అసలు విషయం బోధపడదు. ఇంతకీ ఏమిటా కుట్ర?
తెలంగాణ అభివృద్ధికి వెన్నెముకగా మారిన సింగరేణిని దెబ్బతీసి, సింగరేణి కార్మికుల పొట్టగొట్టి ఇటు సింగరేణిని, తద్వారా రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు తీరని అన్యాయం చేయాలి అన్నదే మోదీ ఎత్తుగడ. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విద్యుత్ రంగంలో మనం సాధించిన ప్రగతి ఎంతో కీలకంగా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి (థర్మల్ పవర్ జనరేషన్)లో సింగరేణి పాత్ర ముఖ్యమైనది. థర్మల్ పవర్ సరఫరాకు సింగరేణి ఆయువుపట్టు. ఈ క్రమంలో సింగరేణిని ప్రైవేటీకరణ పేరుతో దెబ్బ తీస్తే రాష్ట్రంలో తిరిగి చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి అందించే 24 గంటల నిరంతర కరెంట్ను దెబ్బతీయాలి.
ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. పరిశ్రమలు కరెంటు కోతలు ఎదుర్కోవాలి. గిరిజన ప్రాంతాలకు అందించే త్రీఫేజ్ కరెంట్ను రాకుండా చేయాలి. ప్రస్తుతం గిరిజనులకు నెలకు 125 యూనిట్లు అందించే ఉచిత విద్యుత్ను నిలిపివేయాలి. అలాగే నాయీబ్రాహ్మణులు, రజకులకు ప్రస్తుతం నెలకు ఉచితంగా అందించే 250 యూనిట్ల కరెంట్ ఇవ్వకుండా చేయాలి. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్కు అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణను కట్టడి చేయాలంటే సింగరేణిని ప్రైవేట్పరం చేయాలి. ఇదీ మోదీ వ్యూహాత్మక, దీర్ఘకాలిక కుట్ర. దీని నుంచి పుట్టిందే సింగరేణి దశలవారీ ప్రైవేటీకరణ. దీన్ని తెలంగాణ సహిస్తుందా?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎకడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని కేంద్రమంత్రులే వరుసపెట్టి ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీకి కంట్లో నలుసులా తయారైంది. మరోవైపు ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి మాడల్ను దేశ ప్రజల ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణ రాష్ర్టాన్ని దెబ్బతీయాలని మోదీ ప్రభుత్వం చేయని కుట్ర లేదు. అందులో భాగంగానే సింగరేణి విషయంలో గనుల లీజును కార్పొరేట్లకు కట్టబెట్టి తెలంగాణ నోట్లో మట్టి కొట్టాలని మోదీ విషపన్నాగం పన్నాడు. దీన్ని సహిస్తామా?
సింగరేణిని ప్రైవేటీకరిస్తే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సింగరేణికి, ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేటు మాఫియా వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు. కార్మికుల రక్షణకు, పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా చేటు చేస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ గాల్లో కలిసిపోతుంది. కొత్త గనులు రావు. వారసత్వపు ఉద్యోగాలు ఉండవు. గనులు మూతపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కార్మికులకు న్యాయంగా దక్కవలసిన హకులైన బోనస్లు, అలవెన్స్లకు గండిపడుతుంది. దేశ సంపద ప్రైవేటు చేతుల్లోకి వెళితే వాటిని చేజిక్కించుకున్న సంస్థలే అభివృద్ధి చెందుతారు. దీని వల్ల సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు. క్రమక్రమంగా సింగరేణి సంస్థ కనుమరుగవుతుంది. అయితే సింగరేణి కేసీఆర్ మానస పుత్రిక. ఏనాడైనా సింగరేణి సంస్థను కాపాడాలన్నదే ఆయన వజ్ర సంకల్పం. సింగరేణి కార్మికుని కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీసే మానవీయపాలన కేసీఆర్ది. అవునా? కాదా?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎకడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని కేంద్రమంత్రులే వరుసపెట్టి ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీకి కంట్లో నలుసులా తయారైంది. మరోవైపు ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి మాడల్ను దేశ ప్రజల ముందు ఉంచారు.
స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం సింగరేణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నిటీ లీవ్, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే, ఐఐటీ, ఐఐఎంలలో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రియింబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, సింగరేణి ఏరియాలలో నివసించే వారికి పట్టాల పంపిణీ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచిత కరెంటు, సింగరేణి క్వార్టర్లు, డ్యూటీలో చనిపోయిన కార్మికుడికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ వయస్సు 61కి పెంపు ఇలా అనేక కార్మిక సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది.
పారా చెమ్మాస్ పట్టి తెలంగాణ ఉద్యమంలో మమేకమైన సింగరేణి సిరుల మాగాణాన్ని, కార్మికుల బంగారాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్రకు కేంద్రం తెర తీస్తే.. తెలంగాణ ప్రతీ ఇంచూ భావోద్వేగాన్ని పుణికిపుచ్చుకొని, అప్రతిహతంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఊరుకుంటారని మోదీ అనుకుంటున్నారు? కేంద్రం ఇప్పటికైనా తన దుర్మార్గ నిర్ణయాన్ని వెనకి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సింగరేణి కార్మికుల భవిష్యత్తును బజారుపాలు చేయాలనే కుట్రలను పటాపంచలు చేస్తాం. సింగరేణి సంస్థ కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల జీవన విధానం. 130 సంవత్సరాలకు పైగా ఆ ప్రాంత ప్రజలతో మాది పెనవేసుకున్న పేగుబంధం. నల్లసూరీడులు భగ్గుమంటే పరిస్థితులు ఎలా ఉంటాయో కేంద్రం గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కార్మికులను కడుపులో పెట్టుకోవడం తెలుసు. సంస్థను బతికించుకోవటానికి వారిని కార్యోన్ముఖులను చేయటం ఎలాగో తెలుసు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా అవసరమైతే ఢిల్లీలో కొట్లాడేందుకైనా తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. తెలంగాణ అంటే పోరాటాలకు పురిటి గడ్డ. తెలంగాణ బిడ్డలకు పోరాటం కొత్తగాదు. సింగరేణి విషయంలో మోదీ సరార్ గనులను వేలం వేసే కుటిల ప్రయత్నాలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల ప్రతిఘటనను మోదీ, బీజేపీ ఎదుర్కొనక తప్పదు. గుజరాత్ గులాములుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు, రోజూ చిలుక పలుకులు పలుకుతూ తిరిగే నేతలు సింగరేణిపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే తెలంగాణ ప్రజల ప్రతిఘటనను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో దెబ్బ కొట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మరోసారి సమర శంఖం పూరించటానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మోదీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
– బాల్క సుమన్
(వ్యాసకర్త: ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే )