Deeksha Divas | ఒక జర్నలిస్టుగా కేసీఆర్ ఆరోగ్యంపై నిమ్స్ దవాఖాన వద్ద ఆయన కూతురు కవితను నేను ఆరా తీస్తున్న సమయంలో దానం నాగేందర్ వచ్చారన్న సమాచారం కవితకు అందింది. కవితతో పాటు నేను కూడా కేసీఆర్ ఉన్న గదిలోకి వెళ్లాను. కవిత వెంట వెళ్లడంతో వారి తాలూకు వ్యక్తే అయి ఉండవచ్చని భావించి పోలీసులు నన్ను అడ్డగించలేదు. అలా నిమ్స్లోకి వెళ్లి కేసీఆర్ను ఇంటర్వ్యూ చేశాను. ఆ పరిస్థితుల్లో కేసీఆర్ను ఇంటర్వ్యూ చేసిన ఏకైక జర్నలిస్టును కావడం నాకు వ్యక్తిగతంగా గర్వించదగ్గ అంశం. ఆ సమయంలో కేసీఆర్ శారీరకంగా బలహీనంగా కనిపించినా, మానసికంగా మాత్రం చాలా దృఢంగా కనిపించారు. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన వస్తేనే దీక్ష విరమించాలని పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ తాను బతికి ఉండగా ఈ ప్రకటన రాకపోతే, చచ్చిపోయినంకైనా వస్తే చాలు అనే భావనలో కేసీఆర్ కనిపించారు.
మీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతున్నది. దీక్ష విరమించమని వైద్యులు, ప్రభుత్వం కోరుతున్నది కదా? దీక్ష విరమిస్తే ఫలితమేంటి చెప్పండి.
ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు! నేను చచ్చినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని మానసికంగా, భౌతికంగా సిద్ధపడే దీక్ష నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు కూడా తెలంగాణ రాకపోతే వందేండ్లు అయినా రాదు. నా చావుతోనైనా తెలంగాణ వస్తే చాలన్న దృఢ సంకల్పంతో ఉన్నా.
దీక్ష విరమిస్తే ఆ తర్వాత అందరం కలిసి రాష్ట్రాన్ని సాధించుకుందామని అంటున్నారు కదా?
రాష్ట్రం ఇస్తామన్న ఒక మాటకు తప్ప దేనికీ అంగీకరించను… దీక్ష విరమించను.
ఇప్పటికే మీ ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేయడం వల్ల భౌతికంగా బలహీనపడవచ్చునేమో.. కానీ మానసికంగా మాత్రం బలహీనంగా లేను. నా ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్షకు దిగడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారా? ఇవ్వరా అనేది ఆలోచించడం లేదు. నేను బతికి ఉండగా తెలంగాణ ఇవ్వకపోతే…నేను చచ్చిన తర్వాత అయినా ఇవ్వక తప్పదు కదా.
పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణ త్యాగానికి సిద్ధపడటం సమంజసమా?
నాకు చావు అంటే భయం లేదు. అన్నింటికీ సిద్ధపడే చివరకు ఈ నిర్ణయం తీసుకున్నా. ఒక లక్ష్యం కోసం, నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం చనిపోయానన్న ఆత్మ తృప్తి మిగులుతుంది నాకు.. అది చాలు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కృతకృత్యులు అయినట్టు భావిస్తున్నారా?
రాష్ట్ర సాధనలో నేను కృతకృతుడిని అయ్యానో లేదో ఇప్పుడు తెలియదు కానీ, తెలంగాణ కోసం పోరాడేందుకు లక్షలాది మంది కేసీఆర్లను తయారు చేశానన్న సంతృప్తితో హాయిగా కన్ను మూస్తా.
తెలంగాణ రాష్ట్రం అనేది తన పరిధిలో లేని అంశం… అలాంటప్పుడు ఎలాంటి హామీ ఇవ్వగలనని సీఎం రోశయ్య అంటున్నారు.
శాసనసభలో తీర్మానం చేయడమనేది ఆయన పరిధిలోని అంశమే కదా?. సభలో తీర్మానం ప్రవేశపెడితే వ్యతిరేకించేవారు ఎవరున్నారు?. ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇకడ సభలో తీర్మానం చేసి పంపిస్తే ఆ తర్వాత ఎలాగూ కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదు కదా?
శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు..
(ఈ విషయాన్ని ప్రస్తావించగానే కేసీఆర్లో దుఃఖం పొంగుకొచ్చి కండ్ల నుంచి కన్నీరు ధారలై పారింది) శ్రీకాంత్ను కడసారి చూసేందుకైనా అనుమతించండి.. ఉస్మానియాకు వెళ్లి వస్తానని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్ల మనసు కరగలేదు.(అంటూ కేసీఆర్ దు:ఖాన్ని ఆపుకోలేక పోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తమాయించుకొని..) నా కన్నీటి బొట్లే శ్రీకాంత్కు నేను అర్పించే అశ్రునివాళి.
(ఇంతలో డాక్టర్లు వచ్చి ఆయనతో మాట్లాడించవద్దని వారించారు. దీంతో కేసీఆర్ నావైపు చూస్తూ ఇక వెళ్లమన్నట్టు రెండు చేతులు జోడించి సైగ చేశారు.)
…? వెల్జాల చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్