కరీంనగర్ రాంనగర్, మే 22 : ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండు మూడేండ్లుగా డీలా పడింది. ఈ రంగాన్నే నమ్ముకొని వ్యాపారం చేసిన.. పెట్టుబడి పెట్టిన వేలాది మంది ఒక్కసారిగా కుదేలయ్యారు. రియల్ఎస్టేట్ వ్యాపారంతోపాటు చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో కరీంనగర్కు చెందిన ఓ వ్యాపారి ఆగమయ్యాడు. అప్పులు తీర్చడం ఇబ్బందిగా మారడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ సీఐ నీరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్లోని ఆదర్శనగర్కు చెందిన గంగిశెట్టి లక్ష్మణ్ (60) కొంతకాలంగా రియల్ ఎస్టేట్వ్యాపారం చేస్తున్నాడు. దీంతోపాటు సొంతంగా చీటీలు సైతం నడిపిస్తున్నాడు. రెండు వ్యాపారాల్లోనూ నష్టం ఏర్పడింది.
ఈ క్రమంలో తెలిసిన వారి వద్ద సైతం అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించకపోయాడు. ఈ నెల 21న సాయంత్రం పని ఉందని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిపోయాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తీగలగుట్టలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు లక్ష్మణ్ ఉరేసుకోగా, శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గమనించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.