హైదరాబాద్ : రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ( Congress ) పాలనలో అన్ని అబద్దాలతో కాలం గడిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విమర్శించారు. గడిచిన రెండేళ్లలో ఉద్యోగ నియమకాల ( Job recruitment ) పై ముఖ్యమంత్రికి సవాలు ( BRS MLAs Challenge ) విసిరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి సుధీర్ రెడ్డి, మాదవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాజుతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, నేటికి కేవలం 12 వేల 600 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్లను మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని, దమ్ముంటే మీరు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు.
ఫార్మా కంపెనీలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నగరానికి దూరంగా ఫార్మాసిటీ కోసం స్థలాన్ని ఎంపిక చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ స్థలంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్నారని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూం , కేబుల్ బ్రిడ్జితో పాటు అనేక నిర్మాణ పనులను కేసీఆర్ చేపట్టారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క కొత్త నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేపట్టిందని కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రజలు నివశిస్తున్న ప్రాంతంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, శానిటేషన్ తదితర అభివృద్ధి చేపట్టాలని, జనాలు లేని చోట పనులు చేయడం సరైనది కాదని సూచించారు.