హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం సిద్ధమవుతున్నది. డిప్లొమాట్ ఎవెన్యూ కౌటిల్య మార్గ్కు సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్డులో జోధ్పూర్ రాజ వంశీయులకు చెందిన ఓ బంగ్లాలో తాత్కాలికంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ సొంత కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ భవనంలోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే పార్టీ నేతలు అక్కడి రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరిపేందుకు ఈ బంగ్లాను వినియోగించుకోనున్నారు. కాగా, ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్ నిర్మాణాన్ని వేగవంతం చేసి, 6 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ నిరుడు 2న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ భవన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన వెంటనే వికీపీడియాలో సైతం అప్డేట్ అయ్యింది. పార్టీ పేరును ఖరారు చేయడానికి వందకుపైగా పేర్లను పరిశీలించినట్టు వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.