హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) మెడికల్ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరటనిచ్చింది. పరిశోధన విధానాలపై ఆన్లైన్ కోర్సు (ఆన్లైన్ కోర్సు ఇన్ రిసెర్చ్ మెథడ్)ను వివిధ కారణాలతో పూర్తిచేయలేకపోయిన విద్యార్థులు కూడా ఫైనలియర్ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వారు పరీక్షలు పూర్తయిన ఆరు నెలల్లోగా ఈ కోర్సును పూర్తి చేయాలని స్పష్టంచేసింది.
ఆ తర్వాతే ఆయా విద్యార్థుల ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కోర్సు పూర్తిచేయించే బాధ్యత ఆయా కాలేజీల డీన్లకు అప్పగించింది. ఒకవేళ కోర్సుకు ఐసీఎంఆర్లో స్లాట్లు ఖాళీ లేకపోతే.. ఆయా విద్యా సంస్థలే సొంతంగా కోర్సును నిర్వహించవచ్చని, సర్టిఫికెట్లను డీన్ జారీ చేయవచ్చని తెలిపింది. కోర్సు పూర్తి చేశారో లేదో పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు తనిఖీ చేస్తుందని చెప్పింది. ఈ సడలింపులు ప్రస్తుత బ్యాచ్కు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పీజీలో చేరే విద్యార్థులంతా ఆన్లైన్ కోర్స్ ఇన్ రిసెర్చ్ మెథడ్ను పూర్తి చేయడం తప్పనిసరి. ఇది పూర్తిచేసిన వారినే పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతిస్తారు. పలువురు విద్యార్థులు, యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ ఒక్క ఏడాదికి ఈ నిబంధన నుంచి ఎన్ఎంసీ సడలింపు ఇచ్చింది.