పర్వత గిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి పర్వతాల ప్రాంతంలో కాకతీయుల నాటి శివాలయంలో లింగ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలు శనివారం వేద మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఉషా దయాకర్ రావు దంపతులు, తదితరులచే యంత్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
లింగానికి పూజాదికాలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు.లింగ పున: ప్రతిష్ట పూర్తి కావడంతో వేలాది గా భక్తులు శివలింగ దర్శనం చేసుకుంటూ అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా శనివారం నుంచి పర్వతాల శివాలయం జాతర ప్రారంభమయ్యింది. శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో కల్యాణం, పూర్ణాహుతి, పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి వందలాది మంది పాఠశాల విద్యార్థులతో శివ నామ స్మరణను కొనసాగిస్తున్నారు.
ప్రారంభమైన పర్వతాల శివాలయం జాతరకు ప్రతి ఒక్కరూ వచ్చి, శివున్ని అభిషేకించి పరమేశ్వరుని కరుణకు పాత్రులు కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భక్తులను కోరారు.
సాయంత్రం సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ నేపథ్య గాయని సునీతతో పాటల కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ యంత్రాభిషేకం లో ఎమ్మెల్యే అరూరి రమేశ్, సర్పంచ్ సోమేశ్వర రావు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.