Telangana | రైతుబంధు ఆగింది. దళితబంధు రద్దయ్యింది. గృహలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ పథకాలదీ అదే దారి. ఇప్పుడిక బీసీబంధు బంద్ కానున్నది. ఎయిర్పోర్టుకు డెడికేటెడ్ మెట్రో లైన్ అటకెక్కింది. ధరణి డోలాయమానంలో ఉన్నది. ఫార్మాసిటీపై క్లారిటీ లేదు. సీడీఎఫ్, ఎస్డీఎఫ్ పనులను రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. పాలమూరు-రంగారెడ్డి కాలువల టెండర్లనూ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెలరోజులు పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ రోజుకో రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది. ఈ వరుసలో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం! జిల్లాలు, మండలాలను మళ్లీ పునర్విభజన చేస్తామంటూ ఆదివారం ఓ మీడియా చానల్లో రేవంత్ చేసిన ప్రకటన కలకలం రేపుతున్నది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. నేడు ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే టెండర్ల రద్దు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తమ పరిధిలోని పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరుకావాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకంలో భాగంగా తాగు, సాగునీటిని అందించేందుకు ప్రధాన కాలువల నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. పనులను 3 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టు పరిధిలో 1,226 గ్రామాలకు తాగునీరు అందించటం, 1,536 చెరువులను నింపడంతోపాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉన్నది. అందుకోసం 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. వెంకటాద్రి రిజర్వాయర్ నుంచే ఆయకట్టు ప్రారంభం కానుండగా, సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నది. అందుకు సంబంధించి కాలువల నిర్మాణానికి 15,515 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు రిజర్వాయర్ల కింద కాలువ పనులను చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టాలి. 16.74 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 149 కిలోమీటర్ల పొడవుతో హై లెవల్ కెనాల్ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లోవెల్ కెనాల్ను నిర్మించాల్సి ఉన్నది.
ఆ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.454.56 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. లో లెవల్ కెనాల్ ద్వారా 16 వేల ఎకరాలకు, హైలెవల్ కెనాల్ ద్వారా 1.17 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటుగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందాల్సి ఉన్నది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ-1, 100 కిలోమీటర్ల పొడవుతో కుడికాల్వ- 2, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాల్వ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కాల్వ, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కాల్వ నిర్మించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సుమారు రూ.5,600 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమకాల్వను తవ్వాల్సి ఉండగా, 3 ప్యాకేజీలుగా విభజించి రూ.1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 103 కిలోమీటర్ల పొడవుతో హై లెవల్ ప్రధాన కాల్వను తవ్వాల్సి ఉండగా, దానికింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ పనులకు సైతం టెండర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై కంటే చిన్న ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ లిఫ్ట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారులకు ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వగలిగే ప్రాజెక్టులు ఏమున్నాయి? 6 నెలలు, సంవత్సరం, రెండేండ్లలో పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు ఏవి? ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల పురోగతి, అందులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి? కావాల్సిన నిధులు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. నేడు నిర్వహించనున్న సమావేశంలో ఆయా అంశాలపైన కూడా సమీక్షించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల, ఆయకట్టు అంశాలపైన కూడా సీఎం రేవంత్ సమీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు. తొలుత ఆయా అంశాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అన్ని అంశాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వెనకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు ముడిసరుకులు, యంత్రపరికరాల కొనుగోలుకు 100 శాతం సబ్సిడీతో రూ.1 లక్ష ఆర్థికసాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని నిలుపుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీబంధు పథకం కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1 లక్ష ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసింది. పనిముట్ల కొనుగోలు, లేదంటే ఆధునీకరణ, ముడిసరుకుల కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించింది. అందుకోసం దరఖాస్తులను స్వీకరించగా, 5,28,862 మంది దరఖాస్తు చేసుకొన్నారు.
బీసీ ఏ సామాజికవర్గం నుంచి 2,66,001, బీసీ బీ నుంచి 1,85,136, బీసీ డీ నుంచి 65,310, ఎంబీసీల నుంచి 12,415 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం 4.13 లక్షల మందికిపైగా అర్హులను గుర్తించారు. వారందరికీ ప్రతి నెలా 15వ తేదీన ఆర్థికసాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతను జూలై 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించింది. ఎన్నికల ముందు వరకు దాదాపు 40 వేల మందికి బీసీబంధు అందించింది. ఇంకా 3.60 లక్షల మంది అర్హులున్నారు. తాజాగా ఆ పథకాన్నే నిలుపుదల చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.