కొత్తరోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం
సంస్థ ఆర్థిక క్రమశిక్షణకు గుర్తింపు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) రుణాలు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలతో రోడ్లను అభివృద్ధి చేసిందని, రీపేమెంట్ క్రమం తప్పకుండా చేసిందని ఆర్బీఐ గుర్తించింది. రుణాలు తీర్చడంలో కార్పొరేషన్ క్రమశిక్షణను గమనించిన ఆర్బీఐ కొత్తగా రోడ్లు వేయడానికి రుణాలు తీసుకోవచ్చునని తెలిపింది. గతంలో రోడ్ల అభివృద్ధికి రెండు విడతలుగా కార్పొరేషన్ రూ.2,600 కోట్ల రుణం తీసుకున్నది.
రోడ్లను అభివృద్ధి చేశాక కార్పొరేషన్ క్రమం తప్పకుండా రుణాలను తిరిగి చెల్లిస్తూ వచ్చింది. ఆర్డీసీ ట్రాక్రికార్డును పరిశీలించిన ఆర్బీఐ మరోసారి రుణం తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఆర్బీఐ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి మరో రూ.800 కోట్లు రుణంగా తీసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. రుణం ఖరారైన దృష్ట్యా ఏ రోడ్లు అభివృద్ధి చేయాలి? ఇందులో రూరల్ రోడ్లు ఎన్ని? రాష్ట్ర రహదారులు ఎన్ని? అనే విషయమై అధికారులు డీపీఆర్ రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో రోడ్ల నిర్మాణం తరువాత కార్పోరేషన్ ఏ విధంగా తిరిగి చెల్లిస్తుందన్న విషయాన్ని బ్యాంకులు అడుగుతున్నట్టు తెలిసింది. దీంతో ఆర్డీసీకి సొంత ఆదాయం వచ్చేలా పాలసీలు రూపొందిం చాలని అధికారులు ఆలోచిస్తున్నారు.