హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ నిధులతో సలహాదారులను నియమించుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సలహాదారులు అవసరం లేదని విమర్శించిన రేవంత్రెడ్డి ఇప్పుడు మాత్రం సలహాదారులను ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని 1,000 మీటర్ల లోతులో బొంద పెడతారని హెచ్చరించారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినవారికి, టికెట్లు దక్కనివారికి రాజకీయ పునరావాసం కల్పించడం కోసం, తన వ్యక్తిగత వ్యవహారాలు చూడటం కోసం సలహాదారులను నియమించుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుల నియామకాలపై రేవంత్రెడ్డి కోర్టులో కేసులు వేశారని గుర్తు చేశారు.
తాము మాత్రం ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. నాడు రాష్ట్ర అవసరాల కోసం, పాలనలో పని తీరు మెరుగుపర్చుకోవడం కోసం కేసీఆర్ విషయ నిపుణులైన జీఆర్ రెడ్డి, ఆర్ విద్యాసాగర్రావు లాంటివారిని, రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా నియమించారని వివరించారు. కానీ రేవంత్రెడ్డి మాత్రం ఫక్తు రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో సహకరించిన వేం నరేందర్రెడ్డిని సీఎం సలహాదారుడిగా నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. నరేందర్రెడ్డికి పబ్లిక్ అఫైర్స్లో ఉన్న అనుభవం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులతో సొంత అవసరాలను తీర్చుకోవడానికి సలహాదారులను నియమించుకున్నారని ఆరోపించారు. నాయకుల సంచులు మోసిన వారికి, ఫైల్స్ మోసిన వారికి పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల సలహాదారుగా షబ్బీర్ ఆలీని నియమించారని, మరి ఆ శాఖల మంత్రి ఏ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డికి 50 రోజుల సమయం ఢిల్లీ, విదేశీ పర్యటనలకే సరిపోయిందని, పాలనపై ఎప్పుడు దృష్టి పెడుతారని నిలదీశారు.