హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి(Sandeep Reddy)ని పోలీసులతో నెట్టివేయించడంపై ఆయన స్పందించారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం అన్నారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు.
మా ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారు. మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. సందీప్ రెడ్డి పై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఈ రకంగా వ్యవహరించటం సిగ్గు చేటని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరు(Guduru) గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఇదే సభలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం సరికాదని సందీప్ రెడ్డి తెలిపారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాధవరెడ్డి ఒక మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అన్నారు. కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించారు. సందీప్ రెడ్డిని తోసి వేసి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అతడిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.