దేవరకొండ : తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అభివర్ణించారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ పట్టణంలోని 16వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే ఇవాళ దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయంపాలనలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారు అని ఆయన తెలిపారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అని ఆయన తెలిపారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతుందన్నా అదంతా కేసీఆర్ కృషే అని ఆయన గుర్తు చేశారు .
బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమకారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోసమే ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొంది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, నీల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.