యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుడి వాహనాన్ని స్వామివారు అధిరోహించి భక్తులకు కటాక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా స్వామివారు సూర్య జయంతిని పురస్కరించుకుని ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరు మాఢవీధుల్లో స్వామివారికి మంగళ హారతులు పట్టారు.
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధ్యయనోత్సవాలు రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారి నిత్య ఆరాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం, సాయంత్రం దివ్య ప్రబంధాన్ని పారాయణీకులు పఠిస్తూ పురప్పాట్ సేవను పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వీకులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, డీఈఓ దోర్భాల భాస్కర్ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
యాదగిరీశుడికి నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ లైన్లు భక్తులతో సందడిగా మారాయి. ధర్మ దర్శనానికి 2గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు నిత్యరాబడి రూ.27,18,956 సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.