శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు సంకల్పం పఠించారు.
అనంతరం కలశ స్థాపన చేసి, కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయా బీజమంత్రాలతో, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా సూర్యయంత్ర పూజ, చతుర్వేద పారాఁనాలు, అరుణపారాయణం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య భగవానుడికి ఉత్తర పూజనం, నివేదిన, మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న, సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.