Rasamayi Balakishan | మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రసమయి మాట్లాడుతూ.. మాదిగలు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామని రసమయి అన్నారు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆయన కాంగ్రెస్ వైఫల్యాలను చెబుతూ అనేక పాటలను పాడారని గుర్తు చేశారు. లంగాణ ఉద్యమంలో పాట కీలక పాత్ర పోషించిందని, కానీ ఎంపీ కేశవరావుకు మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేశవరావు ఇంటి ముందు దూందాం నిర్వహిస్తామని రసమయి ప్రకటించారు. తెలంగాణ సంసృతిని అవమానించడం సరైంది కాదని మండిపడ్డారు.. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పే కేశవరావు, భారతదేశానికి బ్రిటిషు వాళ్లు స్వాతంత్య్రం ఇచ్చారా, మనం ఉద్యమం చేసి తెచ్చుకున్నామా చెప్పాలన్నారు.
కడియం శ్రీహరి మాదిగల ద్రోహి అని రసమయి ఆరోపించారు. వరంగల్లో కడియం శ్రీహరిపై చావు డప్పు కొడుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్లోకి వస్తానంటే కేసీఆర్ ఆహ్వానించారని ఆయన అన్నారు. మాదిగ జాతి అంటే కడియం శ్రీహరికి కల్లమంట అని మండిపడ్డారు. కడియం శ్రీహరి వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ లాంటి వాళ్లు అనేక మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ముసలి నక్కలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి మాదిగలకు ద్రోహం చేశాడు కాబట్టి కచ్చితంగా ఆయన్ను ఓడిస్తామని ప్రకటించారు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి వెంటనే శ్రీహరి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.