Dalit Bandhu | అణగారిన వర్గాల అభ్యున్నతిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలగన్నారు. అందుకోసం జీవితపర్యంతం కృషి చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఆయన కలలను సాకారం చేస్తున్న ఏకైక వ్యక్తి, శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో అట్టడుగు వర్గాలు అభివృద్ధి బాటపట్టాయి.
స్వరాష్ట్రం ఏర్పడేదాకా వలసల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేడు దళితుల జీవితాల్లో వెలుగు ప్రసరించింది. వలసలు వదిలి స్థానికంగానే ఉపాధి చూసుకుంటున్నారు. ఒకనాడు చీప్ లేబర్గా పాలమూరు కూలీల చెమట కారుచౌక.. నేడు అదే కూలీలు యజమానులవుతున్నారు. ఆర్థిక స్వావలంబనతో ఆత్మగౌరవానికి ప్రతీకగా వెలుగుతున్నారు.
పై చిత్రంలోని వ్యక్తి పేరు ఈర్లపల్లి వెంకటయ్య. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల. తండ్రి సాయిలు, తల్లి పెంటమ్మ. ఇద్దరూ అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నలు, అక్క పెంచి పెద్దచేశారు. ఆస్తులేమీ లేవు. వారి జీవనాధారం రెక్కల కష్టమే. వెంకటయ్య ఎలాగో లా ఓపెన్లో టెన్త్ పూర్తిచేశాడు. ఆర్థిక స్థోమత లేక 15 ఏండ్లకే పొట్టచేతపట్టుకొని హైదరాబాద్ వలసొచ్చాడు. తాపీ పని, టైల్స్, గ్రానైట్ పరిచే పనికి వెళ్లాడు. కాలం మారుతున్నా బతుకు మారలేదు. ఆదాయం పెరుగలేదు. నెలకు కూలీ ద్వారా వచ్చే రూ.15 వేలు పొట్టకుబట్టకూ సరిపోని దుస్థితి. చేసేదేమీలేక 2009లో స్వగ్రామం చేరుకొన్నాడు. ఓ రోజు ఉదయం పనికి వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డాడు. వైద్యులు మోకాలి పైవరకు కాలును తొలగించారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. అన్నదమ్ములు, అక్క ఆదరణతో బతుకు ఈడ్చుకుంటూ వచ్చాడు. 2015లో నీలమ్మతో పెళ్లి జరిగింది. పాప జశ్విక, బాబు జైషు పుట్టారు.
భార్య రెక్కల కష్టంపైనే ఇల్లు గడిచేది. ‘గోరుచుట్ట మీద రోకలిపోటు’లా పాపకు బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అప్పుచేసి వైద్యం చేయించినా పాప దక్కలేదు. దుఃఖాన్ని దిగమింగుతూ రోజులను గడుపుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ అతని జీవితంలో వెలుగులు నింపింది. అతడి విధిరాతను మార్చింది. మంచానికి పరిమితమైన వెంకటయ్యను యజమానిని చేసిం ది. దళితబంధు సాయంతో 4 నెలల క్రితం కల్వకుర్తిలో గ్రానైట్ షాపు పెట్టుకొన్నాడు. మార్బుల్స్ విక్రయంతోపాటు వాటిని పరిచే కాంట్రాక్టును నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఖర్చులన్నీపోగా నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నాడు. అప్పులు తీర్చా డు. ప్రస్తుతం ఇంటి అవసరాలు పోగా మిగిలిన ఆదాయాన్ని తిరిగి షాపులోనే పెట్టుబడిగా పెడుతున్నాడు. షాపును మరింతగా విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఇది వెంకటయ్య ఒక్కడి విజయగాథ కాదు. నాడు వలసపోయిన అనేక మంది పాలమూరు బిడ్డలు దళిత బంధు దన్నుతో నేడు సాగిస్తున్న విజయయాత్ర. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక అండతో దశాబ్దాల కలలను సాకారం చేసుకొంటూ, ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొంటూ దళితులు రచించుకొంటున్న కొత్త చరిత్ర. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడే నాటికి వలసలకు చిరునామాగా వాసికెక్కింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. జనాభాలో సగానికిపైగా మంది వలసపోయేవారంటే పాలమూరు పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ దళితుల పరిస్థితి మరింత అధ్వానం.. దయనీయం. ఒకవైపు ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతం కావు. సాగుభూమి సంగతి అంతే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక శాతం దళితులకు రెక్కల కష్టమే జీవనాధారం. మరోవైపు సాగునీరు కరువై.. పంటలు లేక, ఉపాధి లేక హైదరాబాద్, ముంబై, పుణె.. ఇలా దేశ నలుమూలలకు వలసపోవడమే జీవనవిధానంగా మారిన విషాదం. ఏండ్లకేండ్లుగా అడ్డా కూలీలుగా, గుంపు మేస్త్రీలుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా బతుకులు ఈడ్చడమే తప్ప సొంతంగా వ్యాపారాలను నిర్వహించేందుకు అవకాశాలు.. అంతమేర ఆర్థిక స్థోమత లేని దైన్యస్థితి. సూటిగా చెప్పాలంటే ఎక్కడ పనిదొరికితే అక్కడికి శాశ్వతంగా వలసపోయేవారు కొందరైతే, ఏడాదిలో సగానికిపైగా రోజులు తాత్కాలికంగా సమీప పట్టణాలకు వలసపోయేవారు మరికొందరు. ఇప్పుడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పాలమూరు దళిత వలస కూలీల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నది. సొంత ఊరిలో ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా తీర్చిదిద్దుతున్నది.
70 శాతానికిపైగా వలసకూలీలే లబ్ధిదారులు
తెలంగాణ సర్కారు దళితబంధు పథకం అమలుకు రాష్ట్ర నలుదిక్కులనుంచి నాలుగు మండలాలను ఎంచుకోగా అందులో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం ఒకటి. 2011 జనాభా లెకల ప్రకారం మండలంలో మొత్తంగా దళిత సామాజికవర్గానికి చెందినవారు 4,176 మంది ఉండగా, 1,242 ఇండ్లు ఉన్నాయి. అందులో అదనంగా మరో 15 వందలకుపైగా జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మండలంలోని దళిత సామాజికవర్గం ఎకువగా వ్యవసాయ కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది హైదరాబాద్, ముంబై, పుణె, సోలాపూర్, గోవా, కర్ణాటక తదితర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారి జీవితమే మారిపోయింది. మండలంలోని 1,407 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. నియోజకవర్గానికి 100 చొప్పున మరో 1,199 దళిత కుటుంబాలకు మొత్తంగా 2,606 కుటుంబాలకు దళిత బంధు అమలు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసింది. లబ్ధిపొందిన దళిత కుటుంబాల్లో 70 శాతానికిపైగా మంది కనీసం తాత్కాలికంగానైనా ఉపాధి కోసం వలసపోయినవారే ఉండడం విశేషం.
స్వగ్రామంలో రెండుచేతులా సంపాదన
నాడు పనిలేక వలసబాట పట్టిన దళిత కుటుంబాలకు దళితబంధు వరంలా మారింది. పూర్తిస్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించేందుకు బాటలు వేస్తున్నది. రోజు కూలీపనికి వెళ్లిన దళితులు ఇప్పుడు యజమానులుగా మారుతున్నారు. కొడవలి పట్టి కోతలు కోసిన చేతులే ఇప్పుడు సర్కారు ఆర్థిక దన్నుతో కోతయంత్రాలను అందిపుచ్చుకొంటున్నాయి. నెలజీతానికి స్టీరింగు పట్టి బతుకులీడ్చుతున్న డ్రైవర్లు సొంత వాహనాలను కొనుక్కొంటున్నారు. ఒక్కమాట లో చెప్పాలంటే యంత్ర పరికరాలు కూలీ రెక్కలకు చేరువవుతున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. అందుకు చారకొండ మండలంలోని దళితబంధు లబ్ధిదారుల జీవితాలే నిదర్శనం. ఇతర ప్రాంతాలకు వలసపోయి ఏండ్లు గా తాము చేసిన వృత్తులకు సంబంధించిన యూనిట్లను సొంతంగా ఏర్పాటు చేసుకొంటూ, సమర్థంగా వ్యాపారాలు చేస్తున్నారు. డ్రైవర్లుగా జీవితాలను వెళ్లదీసినవారు ఓనర్లుగా, మేస్త్రీలుగా పనిచేసినవారు బిల్డర్లుగా, కాంట్రాక్టర్లుగా ఎదుగుతున్నా రు. చారకొండ మండలంలో మొత్తంగా 1,407 యూనిట్లలో ట్రాన్స్పోర్టు 807, రిటైల్ సెక్టార్ 84, సర్వీస్ సెక్టార్ 303, అగ్రికల్చర్ 213 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఒకనాడు పొట్టచేత పట్టుకొని వలసపోయిన వారే నేడు పదుల సంఖ్యలో ఇతరులకు ఉపాధిని కల్పిస్తుండటం విశేషం.
తలరాత మారింది
నాకు వ్యవసాయ భూమి లేదు. కొన్నేండ్లు మహబూబ్నగర్, మరికొన్ని రోజులు నాగర్కర్నూల్లో ఆటో నడిపిన. నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు మించి రాకపోయేటివి. దళితబంధు వచ్చినంక ఇంటికి వచ్చిన. ఆ పైసలతోని వంగూరు మండల కేంద్రంలనే కూల్డ్రింక్ ఏజెన్సీ పెట్టిన. మంచిగ నడుస్తంది. నెలకు రూ.45 వేల వరకు సంపాదిస్తున్న. ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న. దళిత బంధుతో నా తలరాతే మారిపోయింది. కేసీఆర్సార్కు జీవితమంతా రుణపడి ఉంటా.
– ఆరెకంటి లక్ష్మయ్య, జూపల్లి (వంగూరు)
చిన్నతనంలోనే మా అవ్వ ధనమ్మ, నాయిన నర్సింహ చనిపోయిన్రు. పదోతరగతి అయిపోంగనే హైదరాబాద్కు పోయిన. బాలాపూర్ ఏరియాలో 15 ఏండ్లకు పైగా మార్బుల్ పన్జేసిన. నాకు ముగ్గురు ఆడపిల్లలే. పొట్టకు, బట్టకుగూడ కట్టమైతుండె. తెలంగాణ అచ్చినంక కల్వకుర్తిల సుత పనులు పెరిగినయ్. పెద్దపెద్ద బిల్డింగులు పడుతున్నయ్. ఇక్కడే కూలీ చేసుకుని బతుకుదామని ఊరికి వచ్చిన. ఏండ్ల అనుభవమున్నా పనిచేస్తానంటే ఒక్కరూ నమ్మలే. చులకనగా చూసేటోళ్లు. దళితబంధుతో నా బతుకే మారిపోయింది. సొంతంగా మార్బుల్ షాప్ పెట్టుకొన్న. నా విలువ పెరిగింది. ఫోన్ చేసి మరీ పని ఉన్నదని చెబుతున్నరు. అంతా కేసీఆర్ పుణ్యం.
– ఈ వెంకటయ్య, సిర్సనగండ్ల
దళిత బంధుతోనే మా బతుకుల్లో పండుగ
నా చిన్నతనంలనే మా అవ్వ, నాయిన కాలంజేసిండ్లు. పదోతరగతి అయిపోంగనే హైదరాబాద్కు పోయి న. అక్కడే 10 ఏండ్లకుపైగా ఉన్న. ఉప్పల్, నాగోల్, కర్మన్ఘాట్ల మేస్త్రీల కింద కూలీగా మార్బుల్ పన్జేసిన. నెలంతా కష్టపడినా 15 వేలు కూడా అచ్చేటియ్ కాదు. కుటుంబాన్ని సాదడం కష్టమైంది. మూడేండ్ల కింద కల్వకుర్తికి తిరిగొచ్చిన. పనయితే వచ్చుగనీ పెట్టుబడి లేదు. ఇక్కడసుత కూలిపనే దిక్కయింది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని దళితబంధు నన్ను ఓనర్ను చేసింది. ఖర్చులన్నీ పోను ఇప్పుడు నెలకు రూ.20వేల నుంచి రూ. 25వేల దాన్క మిగులుతున్నయ్. కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఈ పెంటయ్య, సిర్సనగండ్ల
కేసీఆర్ మేలు మరువం
ఆర్నెల్ల క్రితం వరకు హైదరాబాద్లోనే ఉన్న. అక్కడే హాస్టళ్ల ఉండుకుంట డీజే, డెకరేషన్ పనికి పోయేది. రోజుకు వెయ్యి కూలీ ఇచ్చేది. పెండ్లిళ్ల సీజన్ లేకపోతే డ్రైవింగ్ చేసేది. మా అమ్మ లచ్చుమమ్మ, నాన్న రాములు పేరుమీద దళితబంధు యూనిట్ మంజూరైంది. ఆ 10 లక్షలతో ఊర్లనే సొంతంగా డీజే, డెకరేషన్ షాపు పెట్టుకొన్న. నలుగురు పిల్లలతో నడిపిస్తున్న. ఒక పెండ్లికి గంపగుత్తగా రూ.80 వేలు తీసుకొంటున్న. పెట్టుబడి, ఖర్చులు అన్నీపోను ఒక పెండ్లికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు మిగులుతున్నయ్. చాలా సంతోషంగా ఉంది. అంతా కేసీఆర్సార్ దయనే.
– దంచుక రమేశ్, జూపల్లి
ఇద్దరం పన్జేసినా ఇల్లు గడవకపోయేది
ఊళ్లె 10 గుంటల భూమి తప్ప ఏమీ లేదు. పనులు కూడా లేకుండె. నా భార్య జ్యోతిని దీస్కొని హైదరాబాద్కు బతుకపోయిన. నేను ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వాచ్మెన్గా పన్జేసేది. మా ఇంటామె ఇండ్లలో పన్జేస్తుండె. ఇద్దరం పన్జేసినా నెలకు రూ.15 వేలకు మించి రాకపోయేది. ఇంటి కిరాయిలు, ఖర్చులకే సరిపోయేటియ్. కేసీఆర్ సార్ దళితబంధు పెట్టినంక మళ్లా ఇంటికచ్చిన. 4 నెలల కిందనే డెయిరీ పెట్టుకున్న. దళితబంధు పైసలతోని ఆరు బర్లను కొన్న. మా అన్నదమ్ముల పొత్తుల ఉన్న రెండకరాలను మొత్తం నేనే కౌలుకు తీసుకొని బర్లకు గడ్డి చల్లిన. ఇప్పుడు రోజుకు 40-50 లీటర్ల పాలను కంపెనీలో పోస్తున్న. అన్ని ఖర్చులుపోనూ నెలకు రూ. 40 వేల వరకు మిగులుతున్నయ్. లక్ష రూపాయల అప్పు తీర్చిన. ఏ రంది లేకుండా ఇప్పుడు బతుకుతున్నమంటే కేసీఆర్ పుణ్యమే.
– అంకిల జ్యోతి శంకర్, జూపల్లి
రెండుచేతులా సంపాదిస్తున్నా
4 ఎకరాల భూమి ఉన్నా నీళ్లు లేక ఎప్పుడూ పడావు ఉండేది. 15 ఏండ్లు హైదరాబాద్లో డ్రైవర్గా పన్జేసిన. నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు అచ్చేటియ్. తెలంగాణ అచ్చినంక ఇప్పుడు సాగు నీళ్ల సౌలత్ మంచిగైంది. ఉన్న భూమిని సాగుచేసుకొని బతుకుదామని ఊరికొచ్చిన. 4 నెలల క్రితం దళితబంధు యూనిట్ మంజూరైంది. తుపాన్ బండి కొన్న. కిరాయిలు మంచిగనే వస్తున్నయ్. నెలకు రూ.25 వేల వరకు సంపాదిస్తున్న. ఇప్పుడు అటు వ్యవసాయం.. ఇటు సొంత బండితో రెండు చేతులా సంపాదిస్తున్న. అన్నివిధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఆరెకంటి రామస్వామి, జూపల్లి