హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): దూరాభారానికి స్వస్తి చెప్తూ.. సౌకర్యానికి పెద్దపీట వేస్తూ విశ్వవిద్యాలయాల పరిధి మార్పులను ప్రత్యేక కమిటీ పూర్తిచేసింది. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటైన కమిటీ.. పలుమార్లు సమావేశమై లోతుగా చర్చించి ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలికి సమర్పించింది. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పాటుకావడం, పలు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ మరో జిల్లాలో విలీనం కావడంతో యూనివర్సిటీల పరిధి మార్పుపై ఉన్నత విద్యామండలి అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సభ్యులు జిల్లాల మధ్య దూరం, కాలేజీల సంఖ్యను బట్టి వర్సిటీల పరిధి మార్పుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శనివారం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆయా ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే, వర్సిటీల పరిధి మార్పు అమల్లోకి రానున్నది.
ముఖ్యమైన మార్పులివే..
రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీల పరిధిలో మార్పులు రానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా యావత్తు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండగా, ఈ జిల్లాలోని మూడు కొత్త జిల్లాలను మూడు యూనివర్సిటీలకు కేటాయించారు. సిద్దిపేట జిల్లాను శాతవాహన యూనివర్సిటీకి, మెదక్ జిల్లాను తెలంగాణకు, సంగారెడ్డి జిల్లాను ఉస్మానియా యూనివర్సిటీ కిందకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను కాకతీయ పరిధి నుంచి తొలగించి, తెలంగాణ వర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలో చేర్చారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీపై ఒత్తిడిని తగ్గించేందుకు మెదక్, సిద్దిపేట జిల్లాలను తొలగించి తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల కిందికి తీసుకొచ్చారు. పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో ఎలాంటి మార్పుచేయలేదు.