రంగారెడ్డి, జనవరి 27(నమస్తే తెలంగాణ): బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలింగంపల్లి మండలం నల్లగండ్ల సమీపంలోని ‘జవహార్ నవోదయ విద్యాలయ’లో 9వ తరగతి చదువుతున్నది. అయితే.. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులలో మానసిక ఆందోళన నివారించేందుకు, ఒత్తిడిని జయించేందుకు ఏటా ప్రధాని సమక్షంలో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం జరుగుతున్నది.
ఈ క్రమంలో 2023, జనవరి 21న దేశ వ్యాప్తంగా జరిగిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్న అక్షర.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతూ ‘బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలి’ అని ప్రశ్నించింది. ఇందుకు ప్రధాని స్పందిస్తూ.. ఒక ఉదాహరణను వివరించారు. ‘కార్మికులు నివసించే బస్తీలోని ఎనిమిదేండ్ల చిన్నారి.. మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచింది. అసలు ఆ బాలికకు అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైంది? అని ఆరా తీశాను
. ఆ చిన్నారి ఇంటి పక్కనే నివసించే వ్యక్తులు ఒక్కో రాష్ర్టానికి చెందినవారు. ఎక్కడెక్కడి నుంచో బతికేందుకు వచ్చారు. వారంతా ఒకే దగ్గర నివసించడంతో ఆ బాలిక వారితో నిత్యం మాట్లాడుతుండేది. ఆ క్రమంలోనే ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఆ చొరవ మెచ్చుకోదగినది. ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు’ అంటూ మోదీ వివరించారు. ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కోసం 38 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.