ములుగు : ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప దేవాలయం నిర్మాణ ప్రక్రియలో ఇంజినీరింగ్ నిపుణులు ఆశ్చర్యపోయే రీతిలో అద్భుత టెక్నాలజీని వినియోగించి సాండ్ బాక్స్ విధానంలో అద్భుత కట్టడాన్ని రూపొందించారని.. ప్రముఖ రచయిత, కవి అంపశయ్య నవీన్ అన్నారు.
వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రపంచ వారసత్వ కట్టడాలు వారోత్సవాల ముగింపు సభ ను హైదరాబాద్ సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంపశయ్య నవీన్ తో పాటు మైమ్ కళాకారుడు మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు.