Ramakrishna Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే రామకృష్ణారావు రూపొందించినన్నిసార్లు రాష్ట్ర బడ్జెట్ను మరే ఇతర ఐఏఎస్ అధికారి రూపొందించలేదు. 2014 ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా బడ్జెట్ల రూపకల్పన, అమలులో భాగస్వామి అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన 12 బడ్జెట్లను రూపొందించారు. ఆయన నాయకత్వంలోనే బడ్జెట్ రూపకల్పన, అమలు జరుగుతున్నది.
ప్రస్తుతం నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రం సభలో పెట్టామని, జూలైలో పూర్తిస్థాయిలో బడ్జెట్ ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు చెప్పారు. ఆయన శనివారమిక్కడ శాసనసభలో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే బయటి నుంచి నిధులను సమకూర్చుకోకతప్పదని, ఇప్పుడున్న రాష్ట్ర రుణాలను రీపేమెంట్ చేస్తున్నందున కొత్త అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధి రేటు తగ్గినప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన పదేండ్లలో తొలిసారి రాష్ట్ర వృద్ధి రేటు తగ్గిందని రామకృష్ణారావు వెల్లడించారు.