బంజారాహిల్స్, నవంబర్ 23: ఎమ్మెల్యేలకు ఎర కేసులో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ బ్రోకర్ రామచంద్రభారతికి రెండు పాస్పోర్టులు ఉన్నట్టు తెలుస్తున్నదని సిట్ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఆర్సీబీకి చెందిన ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లలో డాటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్న క్రమంలో రెండు పాస్పోర్టులు ఉన్నట్టు చిత్రాలు కనిపించాయని, రామచంద్రభారతిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సిట్ దర్యాప్తు అధికారి బీ గంగాధర్ మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఆర్సీబీపై ఐపీసీ 467, 468, 471తో పాటు 12ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు, రెండు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నారని ఆర్సీబీపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్సీబీపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆర్సీబీకి చెందిన ల్యాప్టాప్తోపాటు, రెండు మొబైల్ ఫోన్లను గత నెల 27న సిట్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో ఈ ల్యాప్టాప్, ఫోన్లలోని డాటాను విశ్లేషిస్తున్న క్రమంలో ఆర్సీబీకి రెండు పాస్పోర్టులు ఉన్నట్టు చిత్రాలు లభించాయి. ఒక పాస్పోర్ట్లో రామచంద్రభారతి పేరు శ్రీరామచంద్రగా ఉండగా, తండ్రిపేరు మహాస్వామి మద్వ ధర్మదత్ జీగా నమోదైంది. రెండో పాస్పోర్ట్లో భరత్కుమార్ శర్మ పేరు నమోదైంది. ఈ పాస్పోర్ట్లో తండ్రి పేరు కృష్ణమూర్తిశర్మ వులెక్కుంజగా ఉన్నది. రెండు పాస్పోర్టులు కేరళ చిరునామాతో ఉన్నాయి. ఈ రెండు పాస్పోర్టుల మీద రామచంద్రభారతి ఫొటోయే ఉన్నది.