సమైక్య పాలనలో దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ఎవరూ చేయని సాహసం చేశారు బైరెడ్డి రాంరెడ్డి. ఏకంగా వందబోర్లేసి ‘బోర్ల రాంరెడ్డి’గా స్థిరపడ్డారు. 8ఏండ్లుగా సాఫీగా సాగిన సాగు మళ్లీ ఇప్పుడు కరువు పాలైంది. కండ్లముందే పంట ఎండుతున్నది!
కథ మొదటికొచ్చింది! రాజుకు మౌనభంగం కావడంతో భేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పంటలను కాపాడుకునేందుకు రాంరెడ్డి తిరిగి బోర్లేయడం మొదలుపెట్టారు.
Telangana | నల్లగొండ ప్రతినిధి, మార్చి 3 (నమస్తే తెలంగాణ): అది 2003వ సంవత్సరం. ఎటు చూసినా కరువు తాండవిస్తున్నది. ఎండిపోయిన చెరువులు.. నెర్రెలుబారిన భూములు.. అంతంతమాత్రంగా విద్యుత్తు సరఫరా. ఇలాంటి పరిస్థితుల్లో తన బత్తాయి తోటను కాపాడుకునేందుకు ఓ రైతు ఏకంగా 100కుపైగా బోర్లు వేశాడు. ఆయన పేరు బైరెడ్డి రాంరెడ్డి. కానీ, నీటి కోసం భగీరథ ప్రయత్నం చేసి ఒకదాని తర్వాత ఒకటిగా బోర్లువేసి బోర్ల రాంరెడ్డి అయ్యారు. తెలంగాణలో నాటి దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన చేసిన సాహసం గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరచూ ప్రస్తావించేవారు. నల్లగొండ పక్కనే ఉన్న ముషంపల్లికి చెందిన రాంరెడ్డి స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయన కష్టాలు తీరిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో కరెంటు, సాగునీరు, రైతుబంధు వంటివి క్రమం తప్పకుండా అందడంతో రాంరెడ్డి వ్యవసాయం గాడినపడింది. ప్రస్తుతం 10 ఎకరాల్లో వరి, 20 ఎకరాల్లో బత్తాయితోట సాగు చేస్తున్నారు.
8 ఏండ్లుగా సాఫీగా సాగిన వ్యవసాయం మళ్లీ మొదటికొచ్చింది. రాజుకు మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్లీ చెట్టెక్కినట్టు.. కరువు మళ్లీ ముంచుకొచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా రాంరెడ్డి పంటలు కాపాడుకునేందుకు బోర్ల బాటపట్టారు. రూ.లక్షన్నర వెచ్చించి సొంత భూమిలో నాలుగుబోర్లు వేశారు. చుక్కనీరు పడలేదు. గ్రామంలోని ఇతర రైతులు చెరువులో బోర్లు వేయిస్తున్నారని తెలిసి అక్కడ కూడా రెండు బోర్లు వేశారు. ఒక బోరులో కొద్దిగా నీరు పడడంతో ఆ నీటిని తోటకు తరలించేందుకు రూ.6 లక్షలు వెచ్చించి మూడు కిలోమీటర్ల దూరంలోని తన పొలానికి పైప్లైన్ వేస్తున్నారు. ఇంతాచేస్తే ఆ బోరు నుంచి ఎన్ని రోజులు నీరు వస్తుందో తెలియదు. వరిపొలం పోతే పోయింది.. ఏడేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న బత్తాయితోట ఎండిపోతే ఎలా అని ఆయనకు రందిపట్టుకున్నది.
నిడమనూరు మండలం ఎర్రబెల్లి కూడా బత్తాయి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొత్తం 2,800 ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండగా 1,500 ఎకరాల్లో బత్తాయి, నిమ్మతోటలు ఉన్నాయి. గ్రామంలో నీటికొరత తీవ్రంగా ఉండడంతో రెండు బోర్వెల్స్ నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. రోజుకు కనీసం 10 బోర్ల చొప్పున వేస్తున్నారు. ఇప్పటికే 150 బోర్లు వరకు వేసినట్టు రైతులు చెప్తున్నారు. లక్కుమాల మధుబాబు అనే రైతు తన ఐదెకరాల బత్తాయి తోటను కాపాడుకునేందుకు రెండు లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. ఇలాగే అనేక గ్రామాల్లో పండ్ల తోటలు ముఖ్యంగా బత్తాయి, నిమ్మ పంటల పరిస్థితి దారుణంగా ఉంది.
నల్లగొండ జిల్లాలో ఉద్యానవనశాఖ లెక్కల ప్రకారం దిగుబడి ఇస్తున్న తోటల్లో బత్తాయి 43,672 ఎకరాల్లో, నిమ్మ 9,000, మామిడి 2,160, జామ 387, దానిమ్మ 175, ఇతర పండ్ల తోటలు 1,216 ఎకరాల్లో మొత్తంగా 56,610 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా సాగు చేసిన తోటలు 10 వేల ఎకరాల వరకు ఉండవచ్చని అంచనా. వీటిల్లో ఇప్పటికే 25 శాతానికి పైగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఫిబ్రవరిలోనే పరిస్థితులు ఇలా ఉంటే మే చివరి నాటికి ఈ తోటలను కాపాడుకోవడం ఎలా అనేది రైతులను వేధిస్తున్న ప్రశ్న.
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు కురువక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు ఈ ఏడాది నాగార్జునసాగర్కు వరద రాకపోవడంతో అటు సాగర్ ఆయకట్టు, ఇటు ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటి విడుదల జరగలేదు. దీంతో చెరువులు కుంటల్లోనూ నీటి నిల్వలు అడుగంటాయి.
ఈ ప్రభావం భూగర్భజలాలపై పడింది. సాధారణంగా సాగర్ ఆయకట్టులో వరిపంట సాగుకే రైతులు మొగ్గు చూపుతుంటారు. సాగర్ ఆయకట్టు ఎగువ భాగంలోని ఏఎమ్మార్పీతోపాటు వరదకాల్వ పరిధిల్లో వరితోపాటు పండ్ల తోటల సాగు కూడా గణనీయంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరువులు, కుంటలు నింపడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. ఈ సీజన్లోనూ ఇక్కడ మొత్తం 3 లక్షల ఎకరాల ఆయకట్టుకుగానూ 1.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మరో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు విస్తరించి ఉంటాయి. అయితే కరువు పరిస్థితుల్లో వరితోపాటు కూరగాయల వంటి పంటలను తగ్గించుకునైనా సరే బత్తాయి, నిమ్మ వంటి తోటలను కాపాడుకునేందుకు రైతులు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బత్తాయి గానీ, నిమ్మ గానీ దిగుబడి రావాలంటే కనీసం మూడు నుంచి నాలుగేండ్లు పెంచాల్సి ఉంటుంది.
5వ ఏట నుంచి 10 ఏండ్ల పాటు మంచి దిగుబడి వస్తుంటుంది. ఇందుకోసం ఒక్కో ఎకరానికి కనీసం లక్ష రూపాయల వరకు రైతులు ఖర్చు చేస్తుంటారు. ఐదేండ్ల పాటు ఐదు ఎకరాల్లో తోటలను పెట్టి, పెంచడానికి కనీసం రూ.8లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. దాంతో ఇంతటి విలువైన పంటలు తీరా దిగుబడి వచ్చే సమయంలో ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఓ వైపు వరి పంట, మరోవైపు బత్తా యి, నిమ్మ తోటలకు నీటి ఎద్దడి నెలకొనగా రైతులు వరి పంటను పశువులకు వదిలేసి తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరిపొలం పోతే మళ్లొచ్చే ఏడాది అయినా వేసుకోవచ్చు గానీ పండ్ల తోటల పెంపకం అనేది నాలుగైదు ఏండ్లు పెంచితే తప్పా దిగుబడి మొదలు కాదు. అందుకే తోటలు కాపాడుకునేందుకు బోర్లు తవ్వుతున్నారు. లేదంటే ట్యాంకర్లతో నీటిని పోస్తున్నారు.
సాగు నీరందక ముషంపల్లి గోస అంతా ఇంతాకాదు. కండ్లముందే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు దిక్కుతోచక చూస్తున్నారు. నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లేస్తున్నారు. బైరెడ్డి రాంరెడ్డి ఒక్కడే కాదు, చాలామంది రైతులది ఇదే పరిస్థితి. ఎవరిని కదలించినా కన్నీటి వ్యథే. బత్తాయి తోటలను కాపాడుకునేందుకు నెల రోజుల్లోనే 500కుపైగా బోర్లు వేసినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. ఒక్కో బోరుకు సగటున 40 వేల ఖర్చు లెక్కేసినా మొత్తంగా రైతులు నెల రోజుల్లో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో 50 బోర్లలోనే కొద్దిగా నీళ్లు పడ్డాయి. రెండు దశాబ్దాలనాటి కరువు పరిస్థితులు మళ్లీ చూస్తున్నామంటున్నారు రైతులు.
బోర్ల రాంరెడ్డి మాత్రమే కాదు.. గ్రామంలోని చాలామంది రైతులది ఇదే పరిస్థితి. ఎవరిని కదిలించినా కన్నీటి వ్యథే. గ్రామంలో మొత్తం 2,500 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. 2014కు ముందు 1,500 ఎకరాల్లో బత్తాయి, 1,000 ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగుచేసేవారు. 2005 తర్వాత ఏఎమ్మార్పీ నీరు అందుబాటులోకి రావడంతోపాటు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కరెంటు, సాగునీరుకు కొదువ లేకుండా పోయింది. దాంతో వరిసాగు పెరుగుతూ 2 వేల ఎకరాలకు చేరింది. బత్తాయి 500 ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం వరితోపాటు బత్తాయి తోటలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తోటలను కాపాడుకునేందుకు నెల రోజుల్లోనే 500కుపైగా బోర్లు వేసినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. ఒక్కో బోరుకు సగటున 40 వేల ఖర్చు లెక్కేసినా మొత్తంగా రైతులు నెల రోజుల్లో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. అయినప్పటికీ వీటిలో 50 బోర్లలోనే కాస్తంత నీరుపడింది. గ్రామంలో ఇప్పుడు రెండు దశాబ్దాలనాటి కరువు పరిస్థితులు కనిపిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఊళ్లో ఆరెకరాల బత్తాయి తోటున్నది. నీళ్లు లేక పంటంతా ఆగమైతున్నది. నెల రోజుల్లో 13 బోర్లు వేసిన. దాదాపు మూడు లక్షల వరకు ఖర్చయ్యింది. ఒక్కో బోరు 180 నుంచి 230 ఫీట్ల వరకు వేసినం. ఒక్క బోరు మాత్రమే ఇంచు నీళ్లు పోస్తున్నది. ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు నీళ్లిచ్చి ఉంటే భూగర్భజలాలు పెరిగి తోటలు ఎండిపోకుండా ఉండేవి.
-జెర్రిపోతుల జానయ్య, రైతు
కాల్వ నీళ్ల్లను నమ్ముకొని పదెకరాలు పొలం పెడితే ఇప్పటి దాకా ఐదున్నర ఎకరాలు ఎండిపోగా ఇంకా నాలుగున్నర ఎకరాలు జరజర పారుతుంది. నాలుగు రోజులైతే అదికూడా పోతది అనిపిస్తుంది. రెండు లచ్చలన్నర పెట్టి ఆ పొలం పెడితే గింజ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. పొలం ఎలాగూ నష్టం జరుగుతదని అర్థమైంది కానీ ఏటా నాలుగు పైసలొచ్చే బత్తాయి తోట ఎండుతుందనే భయం పట్టుకున్నది. పాత బోర్లు నాలుగు ఉంటే నాలుగు పోయినయి.
-బక్కతట్ల కోటయ్య, రైతు, ముషంపల్లి గ్రామం, నల్లగొండ మండలం
గతంలో ఎస్సీ కార్పొరేషన్ వచ్చిన మంజూరైన ఇ నాం భూమి 1.10 ఎకరా ల్లో వేసిన బత్తాయి తోట పెట్టిన. అప్పుడు వేసిన బో రు ఇప్పుడు వట్టిపోయిం ది. దాంతో నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. చెట్లను కాపాడుకోవాలని తోటలో ఇంకో బోరు వేయిస్తున్నా. మా ఊళ్లో 450 ఫీట్ల తోతు బోరు వేయించినా నీటి జాడ దొరుకుతలేదు. ఇంత ఖర్చు పెట్టి బోరు వేస్తున్నా నీళ్లు పడుతాయనే నమ్మకం లేదు. తోటను దేవుడే కాపాడాలె.
-లకుమాల మధుబాబు, రైతు ఎర్రబెల్లి, నిడమనూరు మండలం
మేము 20 ఎకరాల్లో నిమ్మ, బత్తాయి తోటలను సాగు చేస్తున్నాం. పదేండ్లుగా నాలుగు బోర్లతోనే నడిచేది. కానీ ఇప్పడు ఉన్న బోర్లు అడుగంటిపోయా యి. తోటలను కాపాడుకోవడానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 26 బోర్లు వేశాం. ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఒకట్రెండు మాత్రం కొద్దిగా పోస్తున్నయి. వాటి కోసం పైపులైన్ వేశాం. మొత్తం 20 లక్షలు ఖర్చు చేశాం. అయినా నీరు అందుతుందనే నమ్మకం లేదు. ప్రభుత్వం కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే తోటలను కాపడుకుంటాం.
-రైతు రాఘవరెడ్డి, రైతు జొన్నగడ్డలగూడెం, తిప్పర్తి మండలం