రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుండగా.. కేసీఆర్ ఇంఛార్జిలను నియమించారు. డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలకు బాధ్యతలు అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్లను కేసీఆర్ నియమించారు. తమను ఇంచార్జిలుగా తీసుకున్నందుకు ఉమ, ప్రవీణ్లు కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావును కరీంనగర్ నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు ఇంఛార్జ్ గా కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను నిజామాబాద్ జిల్లాలోని భాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంఛార్జీగా ఎంపికయ్యారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొండూరు, ఆగయ్యలను పార్టీ సభ్యత్వ నమోదు ఇంఛార్జిలుగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.