మొదటిసారి రైల్వే స్టేషన్లో ఎరువుల అన్లోడ్
సీఎం కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు
దీని నిర్మాణ ఖర్చులో మూడో వంతు రాష్ర్టానిదే
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
విపక్షాలకు అభివృద్ధిపై సోయి లేదు: నిరంజన్రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో/ సిద్దిపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్లో సోమవారం తొలి రైలు ప్రారంభమైంది. కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్కు చేరుకొన్న మొదటి గూడ్స్ రైలు రేక్ ద్వారా ఎరువులను అన్లోడ్ చేశారు. ఈ రేక్పాయింట్ను సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ నుంచి 21 బోగీలలో 1,300 టన్నుల ఎరువులతో గూడ్స్ రైలు గజ్వేల్ రేక్ పాయింట్కు చేరుకొన్నది. ఎరువులున్న బోగీ వద్ద మంత్రులు రిబ్బన్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేక చొరవ తీసుకొన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ రైల్వే లైన్ మంజూరు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రైల్వే మార్గం నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. రైల్వే లైన్కు అయ్యే ఖర్చులో మూడోవంతు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొన్నారని వెల్లడించారు. ఇప్పటికే రూ.650 కోట్లను రాష్ట్ర సర్కారు చెల్లించిందని వివరించారు. రైల్వే లైన్పై కేంద్ర ప్రభుత్వమే అంతా చేసిందని చౌకబారు ప్రచారాలు చేస్తు న్న బీజేపీ నాయకులు ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. గజ్వేల్ రైల్వే రేక్ పాయింట్తో ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, నల్లగొండ తదితర జిల్లాలకు ఎరువులను తక్కువ ఖర్చుతో సరఫరా చేయడానికి వీలు కలిగిందని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ రేక్ పాయింట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి నిరంజన్రెడ్డిని హరీశ్రావు కోరా రు. అటు.. రాష్ట్ర రైతులకు తొమ్మిదో విడత రైతుబం ధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమ కానున్నాయని, ప్రతిరైతు సెల్ఫోన్కు టంగ్.. టంగ్మని మెసేజ్లు వస్తాయని చెప్పారు. రైతుబంధు కో సం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. తెలంగాణ సర్కారును ఆర్థికంగా దెబ్బతీయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఇక్కడి బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రా్రష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎందుకు నిధులు ఇస్తలేదో ప్రశ్నించాలని నిలదీశారు. బీజేపీ జాతీయ నాయకు లు తెలంగాణకు వస్తామంటున్నారని, వాళ్లు ధాన్యం ఎంత కొంటారో చెప్పి రావాలని డిమాండ్ చేశారు.
వందేండ్లు నిలిచిపోయే పథకాలు: నిరంజన్రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు వందేండ్లు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వందల సంవత్సరాల వరకు ప్రజల అవసరాలు తీర్చేలా రాష్ట్రంలో ప్రాజెక్టులు, పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇతర రాష్ర్టాలో 40 లక్షల టన్నుల ధాన్యం పండిస్తుంటే, మన వద్ద 40 లక్షల టన్నుల ఎరువులు సాగు కోసమే వినియోగించటం గొప్ప విషయమని అన్నారు. ప్రతిపక్షాలవి అధికార దాహం తప్ప, రాష్ట్ర అభివృద్ధిపై సోయిలేదని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనోహరాబాద్-గజ్వేల్ సెక్షన్లో మొదటి రైలు ప్రారంభం కావటమే కాకుండా మొదటి సరుకు రవాణా అవుతున్న రైలు ఇదేనని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గజ్వేల్ రైల్వే స్టేషన్ తెలంగాణ స్టేషన్లలోనే ముఖ్యమైనదని దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో రాకేశ్ పేర్కొన్నారు. కరీంనగర్ వైపు రైల్వే లైను మొత్తం పూర్తయితే మెదక్, సిద్దిపేట జిల్లాల వాసుల చిరకాల వాంఛ నెరవేరుతుందని చెప్పారు.
తెలంగాణలో చాలా బాగుంది సార్
మంత్రి హరీశ్తో బీహార్ హమాలీలు
గజ్వేల్ రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ వద్ద సంచులు మోస్తున్న హమాలీలను మంత్రి హరీశ్రావు పలకరించారు. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు. నెలకు ఎంత వరకు సంపాదిస్తున్నారు’ అని ఆరాతీశారు. తామంతా బీహార్ నుంచి వచ్చామని, నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నామని, రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. బీహార్లో పని దొరకటం లేదని, ఇక్కడ చేతినిండా పని ఉన్నదని సంతోషంగా చెప్పారు. ఏమైనా సమస్య ఉన్నదా? అని మంత్రి అడగ్గా, అంతా బాగుంది సార్ అని హమాలీలు సమాధానమిచ్చారు.